ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లాలన్న మిథున్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 09:04 PM

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన పాస్‌పోర్ట్‌ను విడుదల చేయాలని కోరుతూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి కార్యాలయం  నుంచి ఆయన ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో, తన విదేశీ పర్యటనకు వీలుగా, సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్ట్‌ను తిరిగి అప్పగించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.ఈ నెల 27వ తేదీ నుంచి 31 వరకు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నందున, పాస్‌పోర్ట్ అత్యవసరమని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి నాలుగో నిందితుడిగా (ఏ-4) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా సిట్ అధికారులు ఆయన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 71 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న ఆయనకు, సెప్టెంబర్ 29న ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, వారానికి రెండుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని న్యాయస్థానం షరతులు విధించింది.ఒకవైపు మిథున్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించిన తరుణంలోనే, ఆయన తన పాస్‌పోర్ట్ కోసం పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa