ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగులకు.. దీపావళి బోనస్‌ కింద స్పెషల్ గిఫ్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 09:56 PM

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలకు సిద్ధమవుతున్న వేళ.. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులను ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఈ దీపావళి పండగ సందర్భంగా ఆయా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే దీపావళి పండగ దగ్గరపడుతున్న వేళ.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆద్యిత్యనాథ్.. యూపీ సర్కార్ ఉద్యోగులకు భారీ మొత్తంలో దీపావళి బోనస్ ప్రకటించారు. ఈ దీపావళి బోనస్‌ల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్ రూ.1,022 కోట్లు కేటాయించింది. మరోవైపు.. రాజస్థాన్ ప్రభుత్వం


14.82 లక్షల మంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు.. దీపావళి బోనస్‌ల కోసం రూ.1,022 కోట్లు ఖర్చు చేయనున్నారు. పే స్కేల్ లెవెల్-8 వరకు ఉన్న ఉద్యోగులకు 30 రోజుల జీతం ఆధారంగా లెక్కించి.. గరిష్టంగా రూ.6,908 వరకు యూపీ సర్కార్ బోనస్ అందించనుంది. ఉద్యోగులు తాము చేస్తున్న పని పట్ల ప్రదర్శిస్తున్న అంకితభావానికి ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని.. వారి కుటుంబాల్లో పండుగ ఉత్సాహాన్ని నింపడం ఈ బోనస్ లక్ష్యమని యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించింది.


మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కూడా ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని దాదాపు 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అడ్ హాక్ బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. పే స్కేల్ లెవల్-12 లేదా రూ.4,800 లేదా అంతకంటే తక్కువ గ్రేడ్ పే ఉన్న ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుందని రాజస్థాన్ సర్కార్ స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఉద్యోగికి గరిష్టంగా రూ.6,774 అడ్ హాక్ బోనస్ లభిస్తుందని పేర్కొంది. ఇక ఈ దీపావళి బోనస్ ప్రయోజనాలు పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది.


ఈ ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి.. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. 'దీపావళి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బహుమతి. సుపరిపాలనకు అంకితమైన మా ప్రభుత్వం, దీపావళి శుభ సందర్భంగా సుమారు 6 లక్షల మంది ఉద్యోగులకు అడ్ హాక్ బోనస్‌ను ప్రకటించింది' అని ట్వీట్ చేశారు.


దీపావళి బోనస్‌లు, గిఫ్ట్‌లపై ట్యాక్స్‌లు


ఇక ఉద్యోగులు పండగ బోనస్‌లపై పన్ను మినహాయింపు ఉంటుందా లేదా అనే సందేహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ.5 వేల వరకు విలువైన స్వీట్లు, దుస్తులు లేదా గాడ్జెట్‌ల వంటి చిన్న బహుమతులకు సాధారణంగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక రూ.5 వేలకు మించి హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఆభరణాల వంటి బహుమతులు పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ గిఫ్ట్‌ల మొత్తం విలువ ఉద్యోగి వార్షిక ఆదాయానికి జోడించి.. సాధారణ జీతం మాదిరిగానే పన్ను విధిస్తారు.


చిన్న బహుమతులతో పోలిస్తే నగదు బోనస్‌లు ఎల్లప్పుడూ ఉద్యోగి జీతంలో భాగంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు రూ.30 వేల దీపావళి బోనస్ మొత్తం వార్షిక ఆదాయానికి కలిపి.. ఆ ఉద్యోగి ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను వేస్తారు. అయితే నగదు బోనస్‌లకు ప్రత్యేక మినహాయింపు ఏదీ లేదు. ఉద్యోగులు పన్ను నోటీసులను తప్పించుకునేందుకు నగదు బోనస్‌లన్నింటినీ తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లో తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa