దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి త్వరలోనే ఉపశమనం లభించినుంది. నగరం చుట్టూ 117 కి.మీ. మేర పెరిఫెరల్ రింగ్ రోడ్డు ( పీఆర్ఆర్ ) నిర్మాణానికి సంబంధించి బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు కర్ణాటక క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వాహనాలను పీఆర్ఆర్పైకి మళ్లించేందుకు వీలుగా ఈ కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. నగరవాసులను ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేసేందుకు ఇది చారిత్రాత్మక అడుగని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు.
‘వాహనాల రద్దీతో బెంగళూరు నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ట్రాఫిక్ను తగ్గించాలని భావిస్తున్నాం.. ఈ ప్రాజెక్టు ప్రభావం 1900 కుటుంబాలపై పడుతుంది. కానీ వారికి ఉన్న అంచనాల కంటే ఎక్కువగానే ప్రభుత్వం పరిహారాన్ని అందిస్తున్నాం.. కర్ణాటక సర్కారు తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో ఇదీ ఒకటి’ అని బెంగళూరు డెవలప్మెంట్ మంత్రి అయిన డీకే శివకుమార్ తెలిపారు.
ఈ బిజినెస్ కారిడార్ అందుబాటులోకి వస్తే బెంగళూరు నగరంలో ట్రాఫిక్ 40 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. జాతీయ రహదారులు, పారిశ్రామిక జోన్ల మీదుగా వెళ్లే వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా బైపాస్ చేసి వెళ్లిపోతాయని చెప్పారు. బిజినెస్ కారిడార్ పీఆర్ఆర్ ప్రాజెక్ట్కు భూములు ఇవ్వడానికి యజమానులు అంగీకరించని పక్షంలో కోర్టులో పరిహారాన్ని డిపాజిట్ చేసి ముందుకెళతామని వెల్లడించారు. అయితే, ఏ భూమినీ డీనోటిఫై చేయబోమని ఆయన హామి ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.27 వేల కోట్లుగా ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. కానీ, భూ నిర్వాసితుల్లో చాలా మంది నగదుకు బదులు ఇంకో చోట భూమిని పరిహారంగా కోరుకోవడంతో వ్యయం రూ.10 వేల కోట్లలోపే ఉండొచ్చని భావిస్తోంది.
అలాగే, ఇక భూసేకరణ ప్రకియలో వివాదాల పరిష్కారం కోసం ఐదు రకాల పరిహార ప్యాకేజీలను ప్రభుత్వం ప్రకటించింది. అర్బన్ ప్రాంతాల్లోని భూముల గైడెన్స్ విలువకు రెండు రెండు రెట్లు, నగరానికి 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు మూడు రెట్ల పరిహారం చెల్లించనుంది. వీటితో పాటు ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్), ఫ్లోరి ఏరియా రేషియో (ఎఫ్ఏఆర్), భూముల బదిలీని కూడా ప్రకటించింది. ప్రాజెక్ట్ వల్ల అర ఎకరం కంటే ఎక్కువ భూమిని కోల్పోతే సమీపంలోని లేఔట్స్లో 40 శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వనున్నారు. ఒకవేళ అభివృద్ధి చెందిన వాణిజ్య భూమి అయితే ప్రాజెక్టును ఆనుకుని ఉన్న 35 మీటర్ల వాణిజ్య కారిడార్లో 35 శాతం అభివృద్ధి చెందిన ప్లాట్లు, నగదు పొందుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa