ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెహుల్ చోక్సీ కేసులో కీలక పరిణామం.. భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు ఆమోదం

international |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:56 PM

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి.. ఆపై భారత్‌ను విడిచి... విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కేసులో తాజాగా కీలక పరిణాం చోటు చేసుకుంది. చోక్సీ బెల్జియంలోనే ఉన్నట్టు ఆ దేశం గతంలోనే ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. 2025, ఏప్రిల్‌లో బెల్జియం పోలీసులు.. చోక్సీని అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ కేసులో బెల్జియం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భారత అభ్యర్థన మేరకు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిందితుడు.. మెహుల్‌ చోక్సీని.. బెల్జియం అధికారులు అరెస్టు చేయడం సరైన చర్యే అని న్యాయస్థానం పేర్కొంది. పైగా ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు ఆమోదం తెలిపింది. చోక్సీ కేసులో ఇది భారత్‌కు గొప్ప విజయం అంటున్నారు.


ఆంట్వెర్ప్‌లోని కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చోక్సీ అరెస్ట్‌ను సమర్థించడమే కాక.. భారత్‌కు అప్పగించేందుకు అనుమతి ఇస్తూ.. తీర్పు వెల్లడించింది. అయితే ఈ కేసులో చోక్సీకి పై కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అయనా సరే..చోక్సీని ఇండియాకు తీసుకురావడంలో ఇది కీలక ముందడుగు అంటున్నారు.


బెల్జియం కోర్టు తీర్పు.. భారత్‌కు గొప్ప మైలురాయిగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చోక్సీ తరఫు న్యాయవాదులు మాత్రం.. ఈ తీర్పుపై తాను ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని కోర్టులో పేర్కొన్నారు. అయతే ఆంట్వెర్ప్ పోలీసులు.. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే చోక్సీని అరెస్ట్ చేశారు. ఈ నాలుగు నెలలు చోక్సీ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం చోక్సీ చేసుకున్న దరఖాస్తులన్నింటిని బెల్జియన్ కోర్టులు తిరస్కరించాయి. పైగా చోక్సీ తప్పించుకునే ప్రమాదం ఉందన్న కోర్టు.. అతడి అరెస్ట్‌ను సమర్థించడం విశేషం.


మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి.. ఏకంగా రూ.13,500 కోట్ల లోన్ తీసుకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. దీని గురించి బయటకు పొక్కడంతో అతడు ఇండియా విడిచి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చోక్సీని ఇండియాకు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు.. నీరవ్ మోదీని కూడా లండన్ నుంచి ఇండియా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో కీలక సూత్రధారి అయిన చోక్సీ భార్య ప్రీతి బెల్జియం పౌరురాలు. దీంతో అతడు గత కొంత కాలంగా బెల్జియం ఆంట్వెర్ప్‌లోనే ఉంటున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa