అఫ్గానిస్థాన్ - పాకిస్థాన్ ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఖతార్ రాజధాని దోహా వేదికగా జరిగిన ఉన్నత స్థాయి శాంతి చర్చల్లో భాగంగా ఇరు పక్షాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ చర్చల్లో ఖతార్, టర్కీ దేశాలు ముఖ్య మధ్యవర్తులుగా వ్యవహరించడం గమనార్హం. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వయంగా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
అఫ్గానిస్థాన్ - పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వమే లక్ష్యంగా రెండు దఫాలుగా ఈ చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు నేరుగా ఈ సమావేశాల్లో పాల్గొనడం వల్ల ఒప్పందం ప్రాముఖ్యత మరింత పెరిగింది. సరిహద్దు భద్రతలో పారదర్శకతను పెంచడం, ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఈ చర్చల ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో సరిహద్దు ఉల్లంఘనలు జరగకుండా చూసుకుంటామని, శాశ్వత శాంతి కోసం కృషి చేస్తామని ఇరు దేశాలు ఈ సందర్భంగా హామీ ఇచ్చాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా పాక్ - అఫ్గాన్ అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఈ ఒప్పందం కుదరడానికి ముందు పాక్ - అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య కుదిరిన 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పాకిస్థాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి సమయంలో పాకిస్థాన్ వైమానిక దళం అఫ్గానిస్థాన్లోని పాక్టికా ప్రావిన్స్పై వైమానిక దాడులకు పాల్పడింది. పాకిస్థాన్ జరిపిన ఈ దాడుల వల్ల అఫ్గానిస్థాన్లో తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వైమానిక దాడుల్లో ముగ్గురు స్థానిక క్రికెటర్లు సహా మొత్తం 10 మంది పౌరులు మృతి చెందారు. పాక్ చేసిన ఈ దాడులపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దాడులు తామే చేశామని పాక్ భద్రతాధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే తమ లక్ష్యం సాయుధ స్థావరాలేనని, డజన్ల మంది సాయుధ సిబ్బంది మరణించారని, పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని పాక్ అధికారులు చెప్పుకొచ్చారు.
గత కొన్నేళ్లుగా సరిహద్దు కంచె నిర్మాణం, సరిహద్దు నిర్వహణపై ఉన్న విభేదాలు, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పాక్-అఫ్గాన్ సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ తాజా ఒప్పందం సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించడానికి ఒక కీలకమైన చర్యగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. తాత్కాలిక ఒప్పందాలు విఫలమైన ఈ పరిస్థితుల్లో, శాశ్వత శాంతి లక్ష్యంతో కుదిరిన ఈ తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తులో స్థిరత్వాన్ని తీసుకువస్తుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే పౌరుల మరణాలు, వైమానిక దాడుల నేపథ్యంలో ఏర్పడిన అపనమ్మకం కారణంగా ఈ ఒప్పందం విజయవంతంగా అమలు కావడమనేది ఇరు దేశాల రాజకీయ చిత్తశుద్ధి, నిబద్ధతపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa