విదేశాల్లో.. మరీ ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన అత్యంత ప్రతిభావంతులైన భారతీయులు, భారత సంతతికి చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక కసరత్తులు చేస్తోంది. దేశీయ రీసెర్చ్, క్రియేటివ్ రంగాలను బలోపేతం చేసే లక్ష్యంతో.. వారికి మెరుగైన సౌకర్యాలు, గ్రాంట్లను అందిస్తూ కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు నేషనల్ మీడియా కథనం వెల్లడించింది. అమెరికాలో ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉన్నత విద్యపై కఠినమైన ఆంక్షలు అమలుచేస్తున్న నేపథ్యంలో.. ఈ పథకానికి మరింత ప్రాధాన్యత లభించింది.
స్వదేశానికి తిరిగి వచ్చే స్కాలర్లకు గ్రాంట్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా వారు మన దేశంలో ల్యాబ్లను ఏర్పాటు చేసుకుని.. రీసెర్చ్ టీమ్ను నియమించుకునేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. మొదట స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్)లోని 12 నుంచి 14 జాతీయ ప్రాధాన్యత ఉన్న రంగాల్లో పనిచేసే నిపుణులను లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఐఐటీల వంటి దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు ఐఐటీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ పథకాన్ని తయారు చేయడం కోసం ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ఆధ్వర్యంలో ఉన్నత విద్యాశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ విభాగం నిపుణులతో ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే ఈ ప్రయత్నం విజయం సాధించాలంటే కొన్ని కీలక అంశాలను పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్లో అనుభవజ్ఞుడైన ప్రొఫెసర్కు వార్షిక వేతనం సుమారు రూ.35 లక్షల వరకు ఉండగా.. అదే అమెరికాలో అది 1.30 లక్షల డాలర్ల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఉంటుంది. జీతాల విషయంలో ప్రపంచ స్థాయిని అందుకోలేకపోయినా.. సరైన ప్యాకేజీలు అందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కు చెందిన చింతన్ వైష్ణవ్ వంటి విద్యావేత్తలు.. తిరిగి వచ్చే స్కాలర్లకు రెడ్ కార్పెట్ విధానం అమలు చేయాలని చెప్పారు. వారికి నివాసం, ఆతిథ్యం, రోజువారీ అవసరాలు వంటివి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. మేధో సంపత్తి హక్కులు, పరిశోధన స్వతంత్రత, పదవీకాల ఫ్రేమ్వర్క్లపై స్పష్టమైన వివరాలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే గతంలో ఇదే రకమైన ప్రయత్నాలు చేసి విఫలం కావడంతో.. అందులోని లోపాలను గుర్తించి సరిదిద్ది ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అదే సమయంలో భారత పరిశోధన పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది ఒక కీలకమైన చర్యగా భావిస్తున్నారు. అయితే ఈ కొత్త పథకం గురించి ప్రభుత్వం నుంచి లేదా కేంద్ర విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువరించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa