ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నాన్న రాజకీయ జీవితం చివరి దశలో ఉంది': కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడి సంచలన వ్యాఖ్య

national |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:10 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వ మార్పుపై పదే పదే ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో.. ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించింది. తన తండ్రి రాజకీయ జీవితంలో 'చివరి దశలో' ఉన్నారని చెప్పారు. అలాగే ఇకపై ఆయన తన కేబినెట్ సహచరుడు సతీష్ జార్కిహోళికి 'మార్గదర్శి'గా మారాలని సిద్ధరామయ్యకు సూచించారు.


ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోసం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటారని గత నెలలో కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఎల్.ఆర్. శివరామే గౌడ ఈ గందరగోళంపై అధిష్ఠానం స్పష్టత ఇవ్వాలని కోరడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. "శివకుమార్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్‌దే. పార్టీని ఎలా నిర్వహించాలో, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరినీ ఎలా సమతుల్యం చేయాలో వారికి బాగా తెలుసు. చివరికి కష్టం ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుంది" అని గౌడ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ ఊహాగానాలపై అప్పుడు స్పందించిన సిద్ధరామయ్య.. "నేను పూర్తి ఐదేళ్ల పదవీకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను" అని విలేకరులతో చాలాసార్లు చెప్పక తప్పలేదు.


అయితే పార్టీలోని వర్గాలు ఈ నివేదికలను ఖండిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్‌లో రెండు విభిన్న వర్గాలు ఉన్నాయనే చర్చ పదేపదే వినిపిస్తోంది. ఒకటి సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తుండగా, మరొకటి శివకుమార్ కోసం వాదిస్తోంది. ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్న సతీష్ జార్కిహోళి సిద్ధరామయ్య వర్గంలో దృఢంగా ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో సిద్ధరామయ్య కుమారుడు, శాసనమండలి సభ్యుడు అయిన యతీంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచాయి.


బుధవారం బెళగావిలో జరిగిన ఒక కార్యక్రమంలో.. ఈ సంచలన కామెంట్లు చేశారు. అయితే ఈ వేదికపై జార్కిహోళి కూడా ఉన్నారు. అక్కడే యతీంద్ర మాట్లాడుతూ.. "నా తండ్రి రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారు. ఈ దశలో ఆయన ఒక బలమైన సిద్ధాంతం, ప్రగతిశీల మనస్తత్వం కలిగిన నాయకుడికి మార్గదర్శిగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని సమర్థించగలిగే, పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగలిగే సత్తా జార్కిహోళికి ఉంది. అలాంటి సైద్ధాంతిక విశ్వాసం ఉన్న నాయకుడిని కనుగొనడం అరుదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన ఈ మంచి పనిని కొనసాగించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. యతీంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు.. కేవలం ఒక మద్దతు ప్రకటనగా కాకుండా సిద్ధరామయ్య రాజకీయ వారసత్వంపై, రాష్ట్ర నాయకత్వ మార్పుపై అంతర్గత చర్చలకు తెర తీసేలా ఉండటం కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa