చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిన సీన్.. చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాకే హైలైట్గా నిలిచింది. ఆస్పత్రుల్లో జరిగే అక్రమాలను ఆ సినిమాలో చూపించారు. అటు ఇటుగా అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఓ పేషెంట్ బంగారాన్ని.. ఆయన చనిపోయిన తర్వాత ఆస్పత్రి వైద్యులు దొంగిలించారని మృతుడి కుమార్తెలు ఆరోపణలు చేశారు. ఎన్నిసార్లు అడిగినా బంగారం తిరిగి ఇవ్వడం లేదని చెప్పారు. చివరకు చేసేదేమి లేక సోషల్ మీడియాలో తమ గోడు వెల్లబోసుకున్నారు.
మృతుడి కూతుళ్లు గీతిక, పరిణి శెట్టి తెలిపిన వివరాల ప్రకారం.. వారి తండ్రి రాజేంద్ర విట్టల్ శెట్టికి అక్టోబర్ 16న గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన సీబీడీ బెలాపుర్లోని ఎమ్జీఎమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే కొన్ని గంటల తర్వాత ప్రాణాలు కోల్పోయారు రాజేంద్ర విట్టల్. విట్టల్ ఎప్పుడూ ఒక బంగారు కడియం ధరించేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కడియం కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అతడి కూతుళ్లు.. ఆస్పత్రికి సిబ్బంది అడిగారు. వారు మృతుడికి చెందిన అన్ని వస్తువులు అప్పగించారు.. కానీ బంగారు కడియం మాత్రం ఇవ్వలేదు.
విట్టల్ ధరించిన బంగారు కడియంను.. ఆయన తల్లి మంగళసూత్రంతో చేయించారని.. దాని విలువ వెల కట్టలేమని.. తమ కుటుంబానికి అది చాలా ముఖ్యమని గీతిక, పరిణి చెప్పారు. కడియం తిరిగివ్వాలని అడిగితే.. అది స్టీల్ కడియం అని ఆసుపత్రి సిబ్బంది వాదించారని.. ఆ తర్వాత కొద్దిసేపటికి అది ఎక్కడో పోయిందని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఎన్నిసార్లు కడియం గురించి ఈమెయిల్స్, కాల్స్ చేసినా ఆస్పత్రి నుంచి స్పందన లేదని తెలిపారు.
చివరికి చేసేదేమి లేక ఇన్స్టాగ్రామ్లో జరిగిందంతా వివరిస్తూ సుధీర్ఘ పోస్టు పెట్టారు బాధితుడి కూతుళ్లు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అది కేవలం బంగారం కడియం మాత్రమే కాదని.. తమ తండ్రి గుర్తు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితులకు న్యాయం జరగాలని వేలాది మంది నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ముంబై, నవీముంబై, ఎమ్జీఎమ్ ఆసుపత్రికి ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలో.. ఆసుపత్రిపై సోషల్ మీడియాలో యూజర్లు మండిపడ్డారు. ఒకరి మరణాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం సిగ్గుచేటని.. ఈ ఘటనపై ముంబై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఓ యూజర్ డిమాండ్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ప్రియమైన వారిని కోల్పోవడమే చాలా బాధాకరం అంటే.. అలాంటి వాళ్లకు సంబంధించిన తీపి జ్ఞాపకాల కోసం పోరాడటం మరీ దారుణమన్నాడు. సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa