ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి స్టేషన్,,,,,ఆ రైల్వే స్టేషన్ మొత్తం మహిళా ఉద్యోగులే

national |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:22 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో సిటీ రైల్వే స్టేషన్ అరుదైన ఘనతను సాధించింది. ఆ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగులు అందరూ మహిళలే కావడం గమనార్హం. దీంతో ఈశాన్య రైల్వే .. ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి మొత్తం మహిళా ఉద్యోగులతోనే నడిచే రైల్వే స్టేషన్‌గా లక్నో సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రకటించింది. ఈశాన్య రైల్వే డివిజనల్ మేనేజర్ గౌరవ్ అగర్వాల్ శుక్రవారం ఈ ప్రకటన చేశారు. ఇక నుంచి ఈ లక్నో సిటీ రైల్వే స్టేషన్ మొత్తం కార్యకలాపాలను 34 మంది మహిళా ఉద్యోగుల బృందం నిర్వహిస్తుందని తెలిపారు. టికెటింగ్, రిజర్వేషన్లు, సెక్యూరిటీ, సిగ్నలింగ్, క్లీనింగ్ వరకు ప్రతీ పనిని మహిళలే చేస్తారని వెల్లడించారు.


ఈ మార్పు నారీ శక్తి-రాష్ట్ర శక్తి స్ఫూర్తిని నిజం చేస్తోందని డివిజనల్ రైల్వే మేనేజర్ గౌరవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. లక్నో సిటీ రైల్వే స్టేషన్‌లో ఆపరేషన్స్ నుంచి భద్రత వరకు.. ప్రతీ క్లిష్టమైన పాత్రను ఇప్పుడు మహిళలే నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఇది వారి సామర్థ్యాన్ని, అంకితభావాన్ని చాటుతోందని ఆయన పేర్కొన్నారు. లక్నో యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న స్టేషన్ సూపరింటెండెంట్ వర్ష శ్రీవాస్తవ.. ఈ లక్నో సిటీ రైల్వే స్టేషన్‌లోని మహిళా బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం మహిళా ఉద్యోగులకు నాయకత్వం వహించడం గౌరవంగా.. పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని వర్ష శ్రీవాస్తవ వెల్లడించారు.


ఢిల్లీకి చెందిన ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ సుష్మ (33) నేతృత్వంలోని 8 మంది మహిళా ఆర్పీఎఫ్ అధికారులు లక్నో సిటీ రైల్వే స్టేషన్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గౌహతికి చెందిన చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ రమా శ్రీవాస్తవ (50) టికెటింగ్ ఆపరేషన్స్‌.. గోరఖ్‌పూర్‌కు చెందిన చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ విజయ లక్ష్మి పాండే (57) రిజర్వేషన్ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ఈ టీమ్‌లో అత్యంత చిన్న వయస్కురాలిగా 28 ఏళ్ల సింపుల్ శ్యామ్ ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఈ మహిళలు.. దేశ కార్మిక శక్తిలో మహిళల ఐక్యత, బలాన్ని ప్రతిబింబిస్తుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.


లక్నో సిటీ రైల్వే స్టేషన్‌కు గొప్ప చరిత్ర ఉంది. 19వ శతాబ్దపు చివర్లో రోహిల్‌ఖండ్, కుమావోన్ రైల్వే వ్యవస్థలో భాగంగా లక్నో-బరేలీ మీటర్ గేజ్ ట్రాక్‌లో భాగంగా ఈ స్టేషన్‌ను స్థాపించారు. 1886లో లక్నో-సీతాపూర్ విభాగం ప్రారంభం కావడంతో.. ఆ తర్వాత 1925లో డబుల్ లైన్ అందుబాటులోకి రావడంతో ఇది కీలకమైన రవాణా కేంద్రంగా మారింది.


ప్రస్తుతం.. ఈ లక్నో సిటీ రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం గోమతినగర్-ముంబై.. గోరఖ్‌పూర్-హైదరాబాద్ వంటి 14 రకాల ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతటి కీలకమైన స్టేషన్‌ను పూర్తిగా మహిళా ఉద్యోగులు నడపడం అనేది భారతీయ రైల్వే చరిత్రలో ఒక అద్భుత ఘట్టమని సంబంధిత వర్గాలు తెలిపాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa