ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత రొయ్యల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆస్ట్రేలియా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:23 PM

అమెరికా విధించిన భారీ సుంకాలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమకు భారీ ఊరట లభించింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామం దేశీయ రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం వాటా కలిగిన ఏపీ రైతులకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఏడు రోజుల పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ శుభవార్తను స్వయంగా ప్రకటించారు. "భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులకు ఎప్పటినుంచో అడ్డంకిగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది. వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఆస్ట్రేలియా విధించిన పరిమితులు తొలగిపోయాయి. భారత రొయ్యలకు తొలి దిగుమతి అనుమతి లభించింది. ఇది ఈ రంగంలో ఒక పెద్ద ముందడుగు" అని లోకేశ్ 'ఎక్స్‌'  వేదికగా తెలిపారు.2017 జనవరిలో కొన్ని రొయ్యల సరుకుల్లో 'వైట్ స్పాట్ వైరస్' గుర్తించడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి పొట్టు తీయని రొయ్యల దిగుమతులపై నిషేధం విధించింది. అప్పటి నుంచి భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు, ఇటీవల ట్రంప్ హయాంలో అమెరికా ప్రభుత్వం భారత రొయ్యలపై 59.72 శాతం వరకు సుంకాలు విధించడంతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఏపీ నుంచి 70 శాతం రొయ్యలు అమెరికాకే ఎగుమతి అయ్యేవి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరచుకోవడం కీలకంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa