ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన ద్రౌపది ముర్ము.. తొలి రాష్ట్రపతిగా గుర్తింపు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:23 PM

కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు దర్శించుకున్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.


మంగళవారం రోజు సాయంత్రం కేరళకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. బుధవారం రోజు ఉదయమే శబరిమల పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. పంబా నది ప్రాంతం నుంచి పద్ధతి ప్రకారం ఇరుముడిని తలపైన ధరించిన ఆమె.. ప్రొటోకాల్ పక్కన పెట్ట మరీ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాష్ట్రపతికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే అయ్యప్ప దర్శన ఆచారాలను నిశితంగా పాటిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాల ధరించి ఇరుముడితో.. పవిత్రమైన 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అక్కడ స్వామివారికి ఇరుముడిని సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


దర్శనం అనంతరం రాష్ట్రపతి ముర్ము ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో రెండు గంటల పాటూ విశ్రమించనున్నారు. అక్కడే ఆమెకు ప్రత్యేకంగా ఆహారాన్ని వండి వడ్డించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.10 గంటలకు రాష్ట్రపతి ముర్ము శబరిమల నుంచి తిరుగు పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయం వద్ద ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.


అత్యున్నత హోదాలో ఉన్న మహిళా రాష్ట్రపతి సంప్రదాయబద్ధంగా అయ్యప్ప దర్శనం చేసుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా, భక్తిశ్రద్ధలతో ద్రౌపది ముర్ము అయ్యప్పను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొస్తున్నారు. ఆమె వచ్చిన విమానానికి ప్రమాదం జరిగినా ఆమె పట్టించుకోకపోవడం, ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ నడుచుకుంటూ వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నట్లు వివరిస్తున్నారు.


కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా దీనిపై స్పందిస్తూ.. ద్రౌపది ముర్ముపై ప్రశంసలు కురిపించారు. 67 ఏళ్ల వయసు కల్గిన ఆమె.. ఏ నియమాలను ఉల్లంఘించలేదని, ఎవరి విశ్వాసాన్ని గాయపరచలేదని చెప్పారు. అందరి నమ్మకాలను గౌరవిస్తూ.. ఇరుముడిని నెత్తిమీద పెట్టుకుని మరీ స్వామి వారికి చెంతకు చేరుుకున్నారు. అయ్యప్ప దర్శన ఆచారాలన్నీ పాటించి, అయ్యప్ప స్వామి ముందు నమస్కరించిన మొదటి రాష్ట్రపతి అయ్యారని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa