ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. చిన్నారులు సహా ఏడుగురు చనిపోయినట్లు జెలెన్‌స్కీ ప్రకటన

international |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:37 PM

ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. మృతుల్లో ఇద్దరు అమాయక చిన్నారులు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. రష్యా వైమానిక దాడుల్లో ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్లో ఉన్న ఒక కిండర్‌ గార్డెన్‌పై దాడి జరిగింది. కిండర్‌గార్డెన్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో మొత్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండగా.. సుమారు మరో 26 మంది గాయపడినట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు.


మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరగాల్సిన అత్యవసర భేటీని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు. ట్రంప్, ఇతర యూరోపియన్ దేశాల నాయకులు కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ.. ఫ్రంట్‌లైన్ వద్ద కాల్పులు ఆగడం లేదు అని రష్యా ప్రకటించింది. ఈ కారణంగానే చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. శాంతి చర్చలు రద్దయిన కొద్ది గంటల్లోనే రష్యా ఈ దాడులను తీవ్రం చేయడంతో.. యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు విఫలమైనట్లు స్పష్టం అవుతోంది.


 రష్యా పౌర లక్ష్యాలపై దాడులు పెంచిన నేపథ్యంలో.. ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యాపై ప్రతీకార దాడులను ప్రారంభించింది. రష్యాలోని బ్రియాన్‌స్క్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న రసాయన ప్లాంట్‌పై ఉక్రెయిన్ మిలిటరీ దాడి చేసింది. ఈ దాడిలో ఉక్రెయిన్.. బ్రిటన్ సరఫరా చేసిన అధునాతన స్టార్మ్ షాడో మిస్సైల్‌ను ఉపయోగించింది. రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సైతం ఛేదించుకుని ఈ స్టార్మ్ షాడో క్షిపణులు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.


ఈ బ్రియాన్‌స్క్ ప్లాంట్‌లో గన్ పౌడర్, పేలుడు పదార్ధాలు, రాకెట్ తయారీ వంటి కీలక రక్షణ సంబంధ కార్యకలాపాలు జరుగుతాయి. ఈ వ్యూహాత్మక స్థావరంపై దాడి చేయడం ద్వారా ఉక్రెయిన్, రష్యా సైనిక సరఫరాలకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. రెండు దేశాలు పరస్పర దాడులను పెంచడం, కీలక దౌత్య చర్చలు విఫలం కావడం... ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత, యుద్ధ తీవ్రత మరింత పెరిగే సూచనలు ఇస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa