ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను ఓటమితో ప్రారంభించిన భారత్.. సిరీస్ను సమం చేయడమే లక్ష్యంగా రెండో వన్డేకు సిద్ధమైంది. అయితే తొలి వన్డేలో భారత్ ఓడిపోవడానికి వాతావరణం కూడా ఓ కారణమే. ఎందుకంటే భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. దీంతో పలుమార్లు ఓవర్లను అంపైర్లు కుదించారు. దీంతో టీమిండియా ఆశించిన మేర స్కోరు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో రెండో వన్డే జరిగే ఆడిలైడ్లో గురువారం వాతావరణం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
అడిలైడ్ ఓవల్ క్రికెట్ మైదానంలో గురువారం ఉదయం 9 గంటలకు భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే ప్రారంభం కానుంది. అయితే సిరీస్లో గెలవాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిందే. ఇక ఈ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్కు ముందు రోజైన బుధవారం కేవలం 20 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు మాత్రం దాదాపుగా వర్షం కురవకపోవచ్చని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. పూర్తి 50 ఓవర్ల ఆటను ఫ్యాన్స్ వీక్షించొచ్చు.
పెర్త్ పిచ్తో పోలిస్తే ఆడిలైడ్ పిచ్ కాస్త భిన్నమైంది. ఇది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. పెర్త్ పిచ్ మాత్రం పేసర్లకు స్వర్గధామం. ఈ నేపథ్యంలో ఆడిలైడ్ పిచ్పై భారత బ్యాటర్లు.. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ కూడా వీరి బ్యాట్ నుంచి పరుగులు వస్తే చూడాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో భారత్ మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ ప్లేసులో కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇక హర్షిత్ రాణా బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. అతడి ప్లేసులో ప్రసిద్ధ్ కృష్ణకు చోటు ఇస్తారనే విశ్లేషణలు ఉన్నాయి. మూడు వన్డేల సిరీస్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa