ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హసనాంబ ఆలయం వార్షికోత్సవాల సందర్భంగా ,,,అగ్ని గుండం తొక్కిన డిప్యూటీ కమిషనర్

national |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 08:01 PM

ఓ ఐఏఎస్ అధికారిణి అమ్మవారి ఆలయంలో నిప్పుల గుండంపై నడిచి తన అచంచలమైన భక్తిని చాటుకున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేఎస్ లతా కుమారి ప్రముఖ హసనాంబ ఆలయంలో జరిగిన అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నిప్పులపై నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అగ్నిగుండంపై మహిళా ఐఏఎస్ నడుస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. హసనాంబ ఆలయ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఉదయం సంప్రదాయబద్దంగా కెండోత్సవం (అగ్ని గుండం) నిర్వహించారు. ఈ ఆలయం వార్షికోత్సవాలు బుధవారంతో ముగియగా.. ఏడాది పొడువునా గర్భగుడిని మూసివేసే ముందు ఈ క్రతువును జరిపించే ఆనవాయితీ కొనసాగుతోంది.


 ఈ ఉత్సవంలో డిప్యూటీ కమిషనర్ లతా కుమారి స్వయంగా పాల్గొని, నిప్పు కణికలపై ఒట్టి కాళ్లతో నడిచారు. నిప్పులపై ఆమె నడుస్తుండగా అక్కడున్న భక్తులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. దీనిపై లతా కుమారి మాట్లాడుతూ.. ‘‘పవిత్ర కలశాలతో భక్తులు నిప్పులపై నడుస్తుండటం చూసి నాకు స్ఫూర్తి కలిగింది.. ఇంతకుముందు నేను ఇలా నిప్పులపై ఎప్పుడూ నడవలేదు. మొదట కొంచెం భయమేసింది కానీ అమ్మవారిపై విశ్వాసంతో మనసులో ప్రార్థించుకుని నడిచేశాను. నాకేమీ కాలేదు’’ అని ఆమె తెలిపారు.


హసన్ సిటీలో ఉన్న చారిత్రక హసనాంబ ఆలయంలో దీపావళి ముందు నిర్వహించే ఉత్సవాలకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. ఏడాదికి 8 నుంచి 9 రోజులపాటు ఉత్సవాల సమయంలోనే గుర్భగుడిలోని అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఉత్సవాలకు విశేష స్పందన లభించింది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దాదాపు 26 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా సుమారు రూ. 20 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.


12 వ శతాబ్దానికి చెందిన హసనాంబ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏడాదంతా మూసి ఉంచే గర్భగుడిలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు, పుష్ఫాలు మళ్లీ మరుసటి సంవత్సరం తలుపులు తెరిచే వరకు తాజాగా ఉంటాయి. అంతేకాదు, గర్భగుడిలోని వెలిగించిన అఖండ దీపం కూడా వెలుగుతూనే ఉంటుందని భక్తులు బలంగా నమ్ముతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa