ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానాల్లో పవర్‌బ్యాంక్ తీసుకెళ్లొద్దు,,,డీజీసీఏ కీలక నిర్ణయం!

national |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 08:05 PM

ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానంలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విమానాల్లో పవర్‌బ్యాంకులు తీసుకెళ్లడంపై నిషేధం విధించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పవర్‌బ్యాంక్‌ను అనుమతించడంపై ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించేందుకు.. అంతార్జాతీయంగా వివిధ దేశాలు అనుసరిస్తున్న పద్ధతులు, సాంకేతిక అంశాలను డీజీసీఏ పరిశీలిస్తున్నట్లు సమాచారం.


పవర్‌బ్యాంక్‌పై పూర్తిగా నిషేధిస్తారా..?


ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో పవర్‌బ్యాంక్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. విమానం రన్‌వైకి వస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. మంటలను ఆర్పేయడంతో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న ఎలక్ట్రిక్‌ పరికరం పేలడం వల్లే విమానంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. తర్వాత విమానంలో భద్రతా తనిఖీలు పూర్తి చేసి అనుమతించామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విమానాల్లో పవర్‌‌బ్యాంక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలా లేదా వాటి సామర్థ్యంపై పరిమితులు విధించాలా అనే విషయంపై డీజీసీఏ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా భద్రతా ప్రమాణాలు పాటించని పవర్‌ బ్యాంకులను మాత్రమే నిషేధించడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


ఏ దేశాల్లో.. నిబంధనలు ఎలా..


ఈ విషయంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తమ విమానాల్లో పవర్‌ బ్యాంకుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఇటీవల ఎమిరేట్స్ సంస్థ నిర్ణయం తీసుకుంది. 100 వాట్‌-అవర్‌ల కంటే తక్కువ సామర్థ్యం గల పవర్‌బ్యాంక్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా, ప్రయాణ సమయంలో వాటిని ఛార్జ్‌ చేయడం.. వాటితో వివిధ పరికరాలకు కనెక్ట్‌ చేయడంపై నిషేధం విధించింది. అంతేకాకుండా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇలాంటి నిబంధనలే అమలులోకి తీసుకొచ్చింది. పసిఫిక్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సంస్థలు విమానాల్లో పవర్‌బ్యాంక్‌ల వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశాయి.


ప్రయాణికులకు ఇబ్బందే..


డీజీసీఏ తీసుకునే నిర్ణయాల వల్ల విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తవచ్చని నిపుణులు అంటున్నారు. కొత్త మార్గదర్శకాలు వచ్చిన తర్వాత... తాము పరిమితికి మించి సామర్థ్యం ఉన్న పవర్‌బ్యాంక్‌ను తీసుకెళ్తున్నామా లేదా అని ప్రయాణికులు ఒకటికి రెండుసార్లు చెక్‌చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తే.. ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ భద్రతా మాన్యువల్‌లను కూడా సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa