ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరికొత్త రికార్డు.. గంటకు 453 కిమీ వేగంతో దూసుకెళ్లనున్న సీఆర్ 450 హైస్పీడ్ రైలు

international |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 08:44 PM

ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే రైలును అభివృద్ధి చేసింది చైనా . దీంతో ఆ దేశం బుల్లెట్ రైళ్ల వేగంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. చైనా అభివృద్ధి చేసిన నయా బుల్లెట్ రైలు సీఆర్ 450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ ట్రయల్ రన్‌లో సీఆర్ 450 రైలు గంటకు 453 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుని.. సరికొత్త చరిత్ర సృష్టించింది.


ప్రస్తుతం సీఆర్ 450 బుల్లెట్ రైలును షాంఘై, చోంగ్క్వింగ్‌, చెంగ్డు మార్గంలో తొలి ట్రయల్ రన్ నిర్వహించారు. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైలును అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చైనాలో సేవలందిస్తున్న సీఆర్‌ 400 ఫ్యుక్సింగ్‌ మోడల్‌ రైళ్ల కంటే ఈ సీఆర్ 450 రైలు.. 50 కిలోమీటర్ల అధిక వేగంతో దూసుకెళ్తుంది. సీఆర్‌ 400 మోడల్‌ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. త్వరలోనే పరుగులు తీయించనున్న సీఆర్‌ 450 బుల్లెట్ రైలు గంటకు 400 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లనుంది. దీంతో ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైళ్లుగా గుర్తింపు పొందాయి.


ప్రస్తుతం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే పాత సీఆర్ 400 ఫ్యుక్సింగ్ మోడల్‌తో పోలిస్తే.. ఈ సీఆర్‌ 450ను రైలులో అనేక మార్పుల చేశారు. దీన్ని స్మార్ట్ డిజైన్‌తో రూపొందించారు. ఈ సీఆర్ 450 రైలు ముక్కు 15 మీటర్లు. అంటే సీఆర్ 400 రైలు కన్నా పొడవైన ముక్కును డిజైన్ చేశారు. అలానే పైకప్పును 20 సెంటిమీటర్ల మేర తగ్గించారు. దీంతో పాటు మొత్తం బరువును 50 టన్నుల వరకు తగ్గించారు. దీంతో గాలి నిరోధాన్ని 22 శాతం మేర తగ్గించడానికి అవకాశం లభించింది.


ఈ చర్యల వల్ల ఈ సీఆర్ 450 రైలు వేగం, ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడ్డాయి. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్ల వ్యవధిలోనే 350 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు. ట్రయల్స్ సమయంలో.. రెండు సీఆర్‌ 450 రైళ్లను ఎదురెదురుగా పరుగులు తీయించారు. ఈక్రమంలో ఈ రెండు రైళ్లు గంటకు 896 కిమీ వేగంతో పరుగులు తీసి.. వేగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాయి. దీన్ని అభివృద్ధి చేసిన ఇంజనీర్లు.. స్పోర్ట్స్ కార్ల డిజైన్ ప్రేరణతో.. ఈ రైలు ఏరోడైనమిక్ మెరుగుదలపై ఐదు సంవత్సరాలుగా పని చేశారు.


ప్రస్తుతం ఈ హైస్పీడ్‌ రైలు 6లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ పరీక్షలను పూర్తి చేయనుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ రైలు పర్యావరణహితంగా.. చాలా నిశ్శబ్దంగా పరుగులు తీయడమే కాక.. ప్రయాణికులను ఎంతో సురక్షితంగా గమ్యం చేరుస్తుందని చైనా రైల్వే వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఇవి వినియోగంలోకి రానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa