ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీతాలిచ్చి మరీ దొంగతనాలు చేయిస్తున్న గజదొంగ

Crime |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 08:51 PM

సాధారణంగా కంపెనీలు, పరిశ్రమలు స్థాపించి.. ఉద్యోగాలు కల్పించివారిని చూశాము. ఈమధ్య కాలంలో స్కాములు చేసేవారు కూడా జనాలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేయడానికి ఏజెంట్లను నియమించుకుని.. వారికి జీతాలిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం చాలా భిన్నం. ఓ గజ దొంగ.. కొందరికి ట్రైనింగ్ ఇచ్చి.. నెలకింత జీతమిచ్చి మరీ దొంగతనాలు చేయిస్తున్నాడు. ఇందుకోసం ఏకంగా 10 మందిని నియమించుకోవడం విశేషం. రెండు ముఠాలను తయారు చేసి.. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేయిస్తున్నాడా వ్యక్తి. తాజాగా జగిత్యాల రూరల్ పోలీసులకు ఈ దొంగల ముఠా చిక్కడంతో.. వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..


జగిత్యాల డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దొంగల ముఠాకు నాయకుడు మహారాష్ట్ర, హింగొలి జిల్లా బస్మత్‌ తాలూకా ప్రాంతానికి చెందిన మార్కులె అనిల్‌(30). జగిత్యాలలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడేందుకు గాను ఇతడు ఏకంగా 10 మందిని నియమించుకుని ముఠాలను తయారు చేశాడు. ఒక్కోదాంట్లో నలుగురు దొంగలు వీరికి ఒక డ్రైవర్ ఉంటారు. వీరంతా నాలుగైదు రోజులకు ఒకసారి .. ఒక ప్రాంతంలో చోరీకి పాల్పడతారు. దొంగతనం చేయడానికి ముందు.. వీరు ముఖాలకు మాస్కులు ధరించి.. కార్లలో తిరుగుతూ.. తాళాలు వేసిన ఇళ్లను గుర్తిస్తారు


ఆ తర్వత రాత్రి వచ్చి.. తాళాలు పగులకొట్టి.. ఇళ్లలోకి చేరి ఉన్నకాడికి దోచుకెళ్తారు. ఇలా దొంగిలించి తీసుకొచ్చిన సొమ్మును.. ముఠా సభ్యులు అనిల్‌కు అప్పగిస్తారు. ఇలా గత కొంతకాలంగా వీరు పలు చోట్ల దొంగతనాలు చేశారు. మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్రలో కూడా పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు.. డీఎస్పీ వెల్లడించారు.


పోలీసులకు ఎలా చిక్కారంటే..


ఈ నెల అనగా అక్టోబర్ 12న ఈ ముఠా.. జగిత్యాల అర్బన్‌ మండలంలోని ధరూర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న పలు ఇళ్లలో దూరి చోరీలకు పాల్పడ్డారు. దీని గురించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ ముఠాను అరెస్ట్ చేయడం కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ముఠా కదలికల మీద నిఘా పెట్టాయి.


సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాల సాయంతో.. బుధవారం నాడు.. కారులో పారిపోతున్న ముగ్గురు దొంగలను గుర్తించారు పోలీసులు. వారిని వెంబడించి.. జిల్లాకేంద్రంలోని బైపాస్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో మహారాష్ట్రకు చెందిన ఒక బాలుడు(15), సాయినాథ్‌(20), మండె శ్రీకాంత్‌(29) అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. వీరిలో ఇంద్రవెల్లికి చెందిన శ్రీకాంత్ ఈ ముఠాకు కారు డ్రైవర్‌గా ఉన్నాడు.


ప్రధాన నిందితుడు అనిల్‌ పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. అతడి కోసం మూడు బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి 24.5 గ్రాములు బంగారు నగలతో పాటు రూ.19 వేల డబ్బు, ఓ కారు, గ్లౌజులు, స్క్రూడైవర్‌, మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ముఠాలోని మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa