స్నేహ సంబంధాలకే మాయని మచ్చ తెచ్చాడో వ్యక్తి. ముఖ్యంగా వారం రోజుల్లోనే తిరిగిచ్చేస్తానని చెప్పి 2 వేల రూపాయలు తీసుకోగా.. ఎంతకూ తిరిగివ్వలేదు. దీంతో సదరు వ్యక్తి స్నేహితుడితో గొడవకు దిగాడు. ఈక్రమంలోనే ఒకరినొకరు మాటా మాటా అనుకున్నారు. డబ్బు ఇవ్వకపోగా, తననే తిడుతుండడంతో ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన అతడు కొడవలితో స్నేహుతుడిని నరికి చంపాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మంజునాథ్ గౌడార్, ద్యానంద్ గుండ్లూర్లకు చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. అయితే వారం రోజుల క్రితం మంజునాథ్.. తన స్నేహితుడైన ద్యానంద్ వద్ద నుంచి రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. చాలా అవసరం ఉందని చెప్పి.. వారం రోజుల్లోనే తిరిగిస్తానని మాట ఇచ్చాడు. కానీ వారం అయినా మంజునాథ్ డబ్బులు తిరిగివ్వలేదు. అయితే ఇచ్చిన గడువు ముగిసినా మంజునాథ్ డబ్బు చెల్లించకపోవడంతో ఆదివారం రోజు రాత్రి ద్యానంద్ నేరుగా స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వమని అన్నాడు. కానీ అతడు తన వద్ద లేవని.. ఉన్నప్పుడు ఇస్తానని చెప్పాడు.
ఈక్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. డబ్బులు తీసుకుని తనతోనే మంజునాథ్ గొడవ పడటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ద్యానంద్.. తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడే ఉన్న కొడవలిని తీసుకున్నాడు. ఒక్కసారిగా స్నేహితుడిపై అతి కిరాతకంగా దాడి చేశాడు. ఈ దాడిలో మంజునాథ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తం కారుతున్న స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ మంజునాథ్ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రికి చేరుకున్నాక వైద్యులు అతడు చనిపోయినట్లు ధ్రువీకరించగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.2 వేల కోసం ద్యానంద్.. మంజునాథ్ను హత్య చేసినట్లు వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతుండగా.. ద్యానంద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను కోపాన్ని అదుపు చేసుకోలేకే ఈ నేరం చేశానని అంగీకరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa