ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ నీలం రంగులోకి మారిపోతున్న కుక్కలు.. కారణం ఏంటో తెలుసా?

international |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 08:03 PM

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌కు సంబంధించి ఇప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 1986 చెర్నోబిల్ అణు విపత్తు ప్రాంతం నుంచి వచ్చిన షాకింగ్ చిత్రాలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇక్కడ నివసించే కుక్కల్లో కొన్నింటి బొచ్చు అకస్మాత్తుగా నీలి రంగులోకి మారింది. ఈ ప్రాంతంలోని 700 కుక్కలకు సంరక్షకులుగా ఉన్న ' డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ ' సంస్థ ఈ చిత్రాలను పంచుకుంది. కేవలం వారం క్రితం సాధారణంగా కనిపించిన ఈ మూడు కుక్కలు హఠాత్తుగా రంగు మారడానికి గల కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు, సంరక్షకులు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక రసాయనాలు లేదా భారీ లోహాలకు గురికావడం వల్లే ఈ అసాధారణ రంగు మార్పు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన చెర్నోబిల్ మనుగడ చిహ్నంగా మారిన ఈ కుక్కల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది.


ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనల్లో ఒకటి చెర్నోబిల్ అణు విపత్తు ప్రాంతం. 1986లో జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ గాయాలను మిగిల్చింది. చెర్నోబిల్ అణు విపత్తు ప్రాంతం నుంచి వచ్చిన తాజా ఫోటోలు యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చెర్నోబిల్ మినహాయింపు ప్రాంతంలో నివసించే కొన్ని కుక్కల బొచ్చు అకస్మాత్తుగా ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారినట్టు వాటి సంరక్షకులు గుర్తించారు.


ఈ విషయాన్ని 'డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్' అనే సంస్థ ప్రపంచంతో పంచుకుంది. ఈ కుక్కలు 1986 అణు విపత్తు సమయంలో మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందినవి కావడం గమనార్హం. ఆ ప్రాంతంలో మానవ కార్యకలాపాలు లేకపోవడంతో వన్యప్రాణులు అభివృద్ధి చెందగా.. ఈ కుక్కలు వాటి మనుగడకు ఒక చిహ్నంగా మారాయి.


సుమారు 18 చదరపు మైళ్ల చెర్నోబిల్ మినహాయింపు జోన్‌లో నివసిస్తున్న 700 కుక్కలకు సంరక్షకులుగా ఉన్న ఈ డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ సంస్థ.. ఇటీవల నిర్వహించిన సాధారణ వైద్య తనిఖీలు, స్టెరిలైజేషన్ ప్రక్రియలో భాగంగా 3 కుక్కలు నీలిరంగు బొచ్చుతో కనిపించడం గుర్తించారు. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేవలం వారం రోజుల క్రితం కూడా అవి సాధారణ రంగులోనే కనిపించడం గమనార్హం. ఇలా ఒక్కసారిగా ఆ 3 కుక్కలు రంగు మారడం వాటి సంరక్షకులను మాత్రమే కాకుండా.. శాస్త్రవేత్తలను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.


ఆ కుక్కలు రంగు మార్పు వెనుక గల కారణాన్ని సంరక్షకులు, శాస్త్రవేత్తలు ఇంకా కనుగొనలేకపోయారు. కానీ అవి ఏదో ఒక తెలియని రసాయన పదార్థం కారణంగానే అలా మారి ఉంటాయని వారు అనుమానిస్తున్నారు. ఇలా కుక్కలు రంగు మారడంపై శాస్త్రవేత్తలు కూడా దృష్టి సారించారు. ఆ చెర్నోబిల్ మినహాయింపు ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక రసాయనాలు లేదా భారీ లోహాల వంటి కాలుష్య కారకాలకు కుక్కలు గురికావడం వల్ల ఇలా రంగు మార్పు జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. వీటికి కారణాలు తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రస్తుతం నీలిరంగు కుక్కల బొచ్చు, చర్మం, వాటి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు.


ఇలా కుక్కల రంగు మారడానికి కారణం ఏంటో తమకు తెలియదని.. డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ సంస్థ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి.. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామమని.. అవి ఏదో ఒక రసాయనంలోకి వెళ్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. ప్రస్తుతం అవి చాలా చురుకుగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నాయని.. అందుకే వాటిని పట్టుకోవడం కష్టంగా ఉందని పేర్కొంది. చెర్నోబిల్ అసాధారణ వన్యప్రాణుల చరిత్రలో ఈ నీలిరంగు కుక్కల ఉనికి ఒక కొత్త, ఆసక్తికరమైన మిస్టరీగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa