అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ భారతీయ యువకుడికి అలాగే ఒక్కరోజులోనే కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల అనిల్కుమార్ బోల్లా.. విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. ఆయన యూఏఈ లాటరీ చరిత్రలోనే తొలిసారిగా ప్రకటించిన భారీ మొత్తమైన 100 మిలియన్ దిర్హామ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.240 కోట్లకు పైగా) జాక్పాట్ను గెలుచుకున్నారు. అక్టోబర్ 18వ తేదీన జరిగిన 23వ లక్కీ డే డ్రాలో అనిల్కుమార్ ఈ గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకోవడంతో.. అతడి జీవితం ఒక్క రోజులో పూర్తిగా మారిపోయింది.
ఈ సందర్భంగా తన అదృష్ట రహస్యాన్ని అనిల్కుమార్ వెల్లడించారు. తాను ఈ లాటరీ గెలుచుకోవడానికి ఎలాంటి మ్యాజిక్ చేయలేదని.. కేవలం ఈజీ పిక్ పద్ధతిలో టికెట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. లాటరీ టికెట్లోని చివరి సంఖ్య తనకు చాలా ప్రత్యేకమైందని.. అది తన తల్లి పుట్టినరోజు అని పేర్కొన్నారు. ఇక ఈ లాటరీలో విజేతను ప్రకటించినప్పుడు.. తాను పూర్తిగా షాక్లో ఉన్నానని.. తన ఫీలింగ్ను అందరితో పంచుకున్నారు.
ఇక రూ.240 కోట్ల లాటరీ తగలడంతో ఆ డబ్బును ఏం చేస్తాను అనేది కూడా అనిల్ కుమార్ వెల్లడించారు. అంత భారీ మొత్తాన్ని గెలుచుకున్నా.. తాను డబ్బు విషయంలో చాలా బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలి.. సరైన మార్గంలో ఎలా ఖర్చు చేయాలనే దాని గురించి తాను యోచిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం తన వద్ద డబ్బు ఉందని.. తన ఆలోచనలపై సరిగ్గా దృష్టి పెట్టి.. తాను ఇప్పుడు ఏదైనా ఒకటి గొప్పగా చేయాలనుకుంటున్నానని వెల్లడించారు.
లాటరీలో వచ్చిన డబ్బుతో ఒక సూపర్ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఒక లగ్జరీ రిసార్ట్ లేదా సెవెన్ స్టార్ హోటల్లో ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నప్పటికీ.. తనకు తన కుటుంబ సభ్యులతో గడపడమే అత్యంత ఇష్టమని వెల్లడించారు. తాను తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలని అనుకుంటున్నానని.. జీవితాంతం వారితో కలిసి సంతోషంగా గడపాలని అనుకుంటున్నానని చెప్పారు. ఈ మొత్తంలో కొంత భాగాన్ని విరాళంగా కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా లాటరీ టికెట్లు కొనుగోలు చేసే మిగితా వారికి ఈ సందర్భంగా అనిల్ కుమార్ ఒక సూచన చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఒక కారణం కోసమే జరుగుతుందని తాను నమ్ముతానని.. ప్రతి ఒక్కరూ ఆడుతూ ఉండండి.. కచ్చితంగా ఒక రోజు అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని ప్రోత్సహించారు. కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో కూడా దుబాయ్లో నివసిస్తున్న మరో భారతీయ పౌరుడు సందీప్ కుమార్ ప్రసాద్ అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 15 మిలియన్ దిర్హామ్లు (సుమారు రూ.35 కోట్లు) గెలుచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa