ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధిక వడ్డీ పేరుతో రూ. 400 కోట్లు వసూలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 08:19 PM

నాలుగు నెలల క్రితం విజయవాడలో భారీ ట్రేడింగ్ మోసం బయటపడింది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అధిక వడ్డీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో రూ. 400 వందల కోట్లు వసూలు చేసి బోర్డు తిరగేశాడు ఆదిత్య అనే వ్యక్తి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు.. నిందితుల ఇళ్లలో సోదాలు చేశాయి. ఆదిత్యతో పాటు అతడి భార్య సుజాతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో దర్యాప్తు ఇప్పుడో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారని సమాచారం.


ప్రత్యేక కోర్టు ఏర్పాటు..!


ఆదిత్య ట్రేడింగ్ మోసం కేసులో అక్టోబర్ 27న హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, గుంటూరు తదితర 9 ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు. ప్రధాన ఏజెంట్ల ఇళ్లను తనిఖీ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో రూ.100 కోట్ల విలువైన 55 ఆస్తులను గుర్తించి.. వాటిని అటాచ్‌ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు అధికారులు. అంతేకాకుండా పలు బ్యాంకు ఖాతాల్లోని రూ.3 కోట్లును ఫ్రీజ్‌ చేసి.. బంగారు ఆభరణాలూ స్వాధీనం చేసుకున్నారు. మోసపోయిన బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఏలూరు జిల్లాకు చెందిన ఆదిత్య పదో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం విజయవాడలో ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్‌లా చేరాడు. బీమా కంపెనీలో పని చేసిన అనుభవంతో 2022లో అద్విక ట్రేడింగ్‌ కంపెనీ ప్రారంభించి.. రూ.లక్ష కడితే నెలకు ఆరు శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికాడు. ఇలా వందల మంది దగ్గర వసూలు చేసిన డబ్బును ట్రేడింగ్‌లో పెట్టి.. లాభాలు వచ్చాక వడ్డీతో సహా ఇస్తానని ఆశచూపాడు. ఇలా ఏలూరు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 60 మంది ఏజెంట్లను పెట్టి రూ. 400 కోట్ల వరకు వసూలు చేశాడు.


ఆడంబరాలకే రూ. కోట్లు ఖర్చు చేశాడు.


ఈ కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) వివరాలు వెల్లడించింది. వసూలు చేసిన డిపాజిట్లలో రూ.260 కోట్లు తిరిగి చెల్లించినట్లు చెప్పింది. ఇంకా దాదాపు 1,200 మందికి రూ.140 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. డబ్బులిచ్చేవారిని నమ్మించేందుకు ఏడాదిన్నరపాటు విజయవాడ నోవాటెల్‌ హోటల్‌లో ఖరీదైన సూట్‌లో బస చేసినట్లు తెలిపారు. ఆ హోటల్‌లో నెలకు రూ.3 లక్షలు అద్దె చెల్లించినట్లు వెల్లడించారు. కాగా డిపాజిట్‌దారుల వద్ద వసూలు చేసిన సొమ్ములో రూ.39 కోట్లకు అసలు లెక్కలే లేవని దర్యాప్తులో తేలింది. ఏజెంట్లు కూడా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. 32 మంది ఏజెంట్లు రూ.49 కోట్ల వరకు లబ్ధి పొందినట్లు, మరో 30 మంది ఏజెంట్లు రూ.9 కోట్ల వరకు నష్టపోయినట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa