ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే వారికి అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 08:23 PM

మొంథా తుపాను ప్రభావం బస్సులు, వాహనాల రాకపోకలపై పడింది. తుపాను కారణంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు రైళ్లు. విమాన సర్వీసులు రద్దు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఆర్టీసీ కూడా సర్వీసులను తగ్గించింది. ప్రయాణికులు ఎక్కువగా ఉండే మార్గాల్లోనే బస్సులను నడపాలని.. అలాగే అవసరం లేని ప్రాంతాల్లో సర్వీసులను కుదిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలంటూ ప్రజలకు ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల బస్టాండ్లు వెలవెలబోతున్నాయి.


నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ బస్టాండ్ .. ప్రయాణికులు లేక వెలవెలబోయింది. తుపాను ప్రభావంతో ప్రయాణికులు తగ్గిపోవటంతో..మంగళవారం టికెట్ల బుకింగ్స్ సగం తగ్గిపోయాయని అధికారులు వెల్లడించారు. ఇక విజయవాడ బస్టాండ్ నుంచి నిత్యం 400 బస్సు సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడిపించేది. మొంథా తుపాను కారణంగా ఇందులో 139 బస్ సర్వీసుల రద్దు చేశారు. దీంతో విజయవాడ బస్టాండ్ అంతా ఖాళీ సీట్లు కనిపించాయి. విజయవాడ నుంచి కాకినాడ, విశాఖ, హైదరాబాద్ వెళ్లే పలు బస్సు సర్వీసులను కూడా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.


మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో గన్నవరం నియోజకవర్గంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షం కూడా కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కేసరపల్లి శివారులోని చెంచుల కాలనీవాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే కృత్తివెన్ను మండలం మాట్లంలో కరెంట్ స్తంభం విరిగిపడి రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఘంటసాల మండలం దేవరకోటలో తాటిచెట్టు ప్రధాన రహదారిపై కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


విశాఖలో భారీ వర్షాలు..


మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుపాను హెచ్చరికల కేంద్రం.. కాకినాడ పోర్టుకు పదో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. విశాఖ, గంగవరం పోర్టులకు 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు, నిజాంపట్నం పోర్టులకు 8వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు భారీ వర్షాలతో విశాఖలోని పలు కాలనీల్లో వరద నీరు చేరింది. దీంతో అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa