ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూలికల కోసం అడవికి వెళ్తే.. కాలికి తగిలిన కుండ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 06:43 PM

ఇద్దరు గొర్రెల కాపరులు.. ఏవో మూలికలు కావాలని అడవిలోకి వెళ్లారు. తమకు కావాల్సిన మూలికల కోసం అణువణువూ గాలిస్తున్నారు. గొర్రెలకు వ్యాధులు రాకుండా ఇలా పసరు మందులు పెట్టడం సర్వసాధారణం. అలాంటి మూలికలను వెతుకుతూ అడవిలోకి వెళ్లిన వారికి ఊహించని అనుభవం ఎదురైంది. స్నేహితుల్లా కలిసి అడవిలోకి వెళ్లిన వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చేలా చేసింది. అలా అడవిలోకి స్నేహితులుగా వెళ్లిన ఇద్దరూ.. శత్రువులై వచ్చారు. ఆ రోజు అసలు అడవిలో ఏం జరిగింది.. స్నేహితులు, శత్రువులుగా ఎందుకు మారారు.. ఇందులోకి పోలీసులు ఎలా ప్రవేశించారు.. పోలీసుల ఎంట్రీతో ఈ ఘటన ఎలాంటి మలుపులు తిరిగిందనేదీ ఇప్పుడు చూద్దాం..


చిత్తూరు జిల్లా పెద్దకొండామర్రి పంచాయతీలోని కోటూరు గ్రామం. ఈ ఊరికి చెందిన చానుల్లా, మునిస్వామి అనే ఇద్దరు వ్యక్తులు గొర్రెల కాపర్లు. గొర్రెల పెంపకం, వాటిని అమ్మగా వచ్చే డబ్బులు..ఇదే వీరి జీవనాధారం. గొర్రెల కాపర్లు కావటంతో వాటికి జబ్బులు చేయకుండా అప్పుడప్పుడూ నాటు మందులు ఉపయోగిస్తుంటారు. తమ అడవిలో దొరికే మూలికలతో పసరు వైద్యం చేస్తుంటారు. అలా మూలికల కోసం కోటూరు అడవిలోకి మూడు రోజుల కిందట మునిస్వామి, చానుల్లా కలిసి వెళ్లారు. అయితే అలా అడవిలోకి వెళ్లినవారికి ఊహించని ఘటన ఎదురైంది. అటవీ ప్రాంతంలో తిరిగే సమయంలో వారి కాలికి ఏదో తగిలింది. ఏంటా అని చూస్తే అదో కుండ. భయం భయంగానే దానిని వెలికి తీసిన ఇద్దరు.. అందులో ఏముందా అని కుండను తెరిచి చూశారు. అందులో మెరిసే వస్తువును చూసి షాక్ తిన్నారు. బంగారం రంగులో మెరుస్తున్న ఓ రేకు వారికి కుండలో లభించింది. అర్ధచంద్రాకారంలో ఆ రేకు ఉంది.


దీంతో ఈ రేకు విషయంలో వారిద్దరి మధ్య మనస్ఫర్ధలు వచ్చాయి. ఈ రేకు తనదంటే తనదంటూ వాగ్వాదం జరిగింది. తనకూ భాగం ఇవ్వాలంటూ మునిస్వామి వాటా అడగ్గా.. చానుల్లా అంగీకరించలేదు. దీంతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకుతూ ఊరంతా విస్తరించింది. అడవిలోకి వెళ్లిన మునిస్వామి, చానుల్లాకు బంగారం దొరికిందంటూ ఊరంతా కోడై కూసింది. దీంతో వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. దీంతో స్థానిక ఎస్ఐ నాగేశ్వరరావు ఇద్దరు గొర్రెల కాపర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అసలేం జరిగిందని ఆరా తీశారు. ఈ క్రమంలోనే రేకు విషయం బయటపడింది.


అయితే పోలీసుల ఎంట్రీతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దొరికిన రేకు బంగారం కాదని తెలిసింది. ఈ రేకు చిత్రపటాలకు వాడే రేకుగా గుర్తించారు. దీంతో ఇద్దరు గొర్రెల కాపర్లు ఉసూరుమన్నారు. తాయెత్తులు అలాంటి వాటి కోసం వీటిని ఉపయోగించి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా స్నేహితులుగా అడవిలోకి కలిసి వెళ్లిన ఇద్దరూ ఈ రేకు కోసం గొడవపడి శత్రువులుగా మారారు. చివరకు తమకు దొరికింది బంగారం కాదని తెలిసి షాక్ తిన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa