అణ్వస్త్ర పరీక్షలను తిరిగి చేపట్టాలనే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్ర పరీక్షలను నిర్వహిస్తోన్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటని, అలాంటప్పుడు మేము ఎందుకు చేపట్టకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్ సహా పలు దేశాలు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నందున తమకు ఈ చర్య అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, అమెరికా కూడా అణ్వస్త్ర పరీక్షలు చేయడం సముచితమేనని ఆయన సమర్దించుకున్నారు. ‘‘రష్యా, చైనాలు పరీక్షలు చేస్తున్నా అవి వాటి గురించి మాట్లాడటం లేవు.. మాదంతా బహిర్గతమే.. మేము బహిరంగంగానే మాట్లాడుతాం.. మేము దాని గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే మీరు రిపోర్ట్ చేస్తారు.. ఇలా రాసే రిపోర్టర్లు వాళ్ల (చైనా, రష్యా) దగ్గర లేరు’’ అని సీబీఎస్ న్యూస్తో ట్రంప్ అన్నారు.
‘‘వాళ్లు పరీక్షల మీద పరీక్షలు చేస్తూనే ఉండటంతో మేము తిరిగి చేపట్టాలని భావిస్తున్నాం.. ఉత్తర కొరియా, పాకిస్థాన్లు ఖచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి.. అణ్వాయుధాలను పరీక్షిస్తున్న ఈ శక్తివంతమైన దేశాలు ఎక్కడ నిర్వహిస్తున్నాయో అమెరికాకు తెలుసుకోవాల్సి అవసరం లేదు కానీ, అణ్వస్త్ర పరీక్షలు మాత్రం జరుగుతున్నాయి’’ అని ఆయన నొక్కి చెప్పారు. ఆపరేషన్ సిందూర్లో పాక్ అణుస్థావరం కిరానా హిల్స్పై బారత సైన్యం దాడిచేసిన విషయం తెలిసిందే.
‘‘వారు భూగర్భంలో చాలా లోతుగా పరీక్షిస్తారు.. అక్కడ పరీక్షలతో ఏం జరుగుతుందో ప్రజలకు ఖచ్చితంగా తెలియదు.. కొంచెం వైబ్రేషన్ అనిపిస్తుంది. వాళ్లు పరీక్షలు చేసినప్పుడు మేము ఎందుకు పరీక్షించకూడదు?’’ అని ట్రంప్ ప్రశ్నించారు. రష్యా ఇటీవల జలాంతర్గత డ్రోన్ పాసిడోన్ సహా అధునాతన అణ్వస్త్ర సామర్థ్యం గల వ్యవస్థలను పరీక్షించింది. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాల తర్వాత అణ్వస్త్ర పరీక్షలు చేపట్టాలనే తన నిర్ణయం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ పై విధంగా సమాధానం ఇచ్చారు.
‘‘వాళ్లు ఏవిధంగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నారో మీరే చూడండి... నేను అణ్వస్త్ర పరీక్షల గురించి మాట్లాడటానికి కారణం రష్యా. అణు పరీక్షలు నిర్వహించబోతున్నట్టు మాస్కో ప్రకటించింది. మీరు గమనిస్తే, ఉత్తర కొరియా నిరంతరం పరీక్షలు చేస్తోంది. ఇతర దేశాలు కూడా పరీక్షలు కొనసాగిస్తున్నాయి.... పరీక్షలు చేయని ఏకైక దేశం అమెరికాయే. పరీక్షలు నిర్వహించని దేశంగా నేను ఉండాలనుకోవడం లేదు’’ అని అన్నారు. అయితే, మరే దేశానికి లేనంతగా తమవద్దే అత్యధికంగా అణ్వస్త్రాలు ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు. అణ్వస్త్రరహితంపై రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్పింగ్లతో చర్చించానని చెప్పారు.
‘‘ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగలిగే అణ్వస్త్రాలు మన వద్ద ఉన్నాయి.. రష్యా వద్ద భారీగానే ఉన్నాయి, చైనా కూడా చాలా సమకూర్చుకుంది’’ అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. కాగా, తాజా పరీక్షల్లో అణ్వస్త్ర పేలుళ్లు ఉండబోవని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ స్పష్టత ఇచ్చారు. అణ్వస్త్ర పరీక్షల ట్రంప్ ప్రకటన తర్వాత వచ్చిన తొలి స్పష్టత ఇదే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa