అఫ్గానిస్థాన్ మరోసారి పెను విపత్తుతో వణికిపోయింది. దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని, ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ-షరీఫ్ సమీప ప్రాంతాలను తాకుతూ సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ తాజా విలయంలో ఏడుగురు మరణించగా.. 150 మందికి పైగా గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదయం వరకు అందిన ఆసుపత్రి నివేదికల ఆధారంగా ఈ సంఖ్యను ప్రకటిస్తున్నట్లు సమంగాన్ ప్రావిన్స్ ఆరోగ్య శాఖ ప్రతినిధి సమీమ్ జోయాండా తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ.. భారీ నష్టం అంచనా
అమెరికా భూగర్భ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం మజార్-ఎ-షరీఫ్ నగరానికి 28 కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. సుమారు 5.23 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో యూఎస్జీఎస్.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గణనీయమైన ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని.. విపత్తు ప్రభావం కూడా చాలా విస్తృతంగా ఉండవచ్చని ఈ వ్యవస్థ హెచ్చరించింది. గతంలో ఈ తరహా అలర్ట్లు జారీ అయినప్పుడు.. ఆ ప్రాంతానికి జాతీయ స్థాయిలో సహాయక చర్యలు అవసరం అయ్యాయి.
భూకంపం ధాటికి మజార్-ఎ-షరీఫ్లోని చారిత్రక, పవిత్ర బ్లూ మసీదు కొంతమేర దెబ్బతిన్నట్లు బల్ఖ్ ప్రావిన్స్ ప్రతినిధి హాజీ జైద్ వెల్లడించారు. భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు, సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన వీడియోల్లో.. సహాయక సిబ్బంది శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అఫ్గానిస్థాన్ రెండు ప్రధాన క్రియాశీల ఫాల్ట్ లైన్లపై ఉండటం వల్ల ఇది తరచూ భూకంపాలకు గురవుతుంది. గత ఆగస్టులో సంభవించిన 6.0 తీవ్రత గల భూకంపం కారణంగా వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2015లో, 2023లో సంభవించిన భారీ భూకంపాలు కూడా వందల నుండి వేల సంఖ్యలో ప్రజల మరణానికి కారణం అయ్యాయి. తాజా భూకంపం సహాయక చర్యలపై పూర్తి వివరాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ త్వరలో వెల్లడించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa