మహబూబ్నగర్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్తకు జైలు శిక్ష విధించింది. కారణం సదరు భర్త.. అదనపు కట్నం కోసం వేధించి, భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు. అందుకే అతడికి కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత ఈ తీర్పు వెల్లడించారు. ఈ కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం మీడియాకు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నూలుకు చెందిన మల్లికకు, మహబూబ్నగర్ జిల్లా, అలంపూర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన చాకలి హరికృష్ణకు మూడు సంవత్సరాల క్రితం అనగా.. 2022 మార్చి 27న వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహం సమయంలో మల్లికకు ఆమె తల్లిదండ్రులు 10 తులాల బంగారం పెట్టారు. కొంత నగదు కూడా ఇచ్చారు. అయినా సరే అదనపు కట్నం కోసం అందునా పెళ్లైన మూడు నెలల నుంచే మరింత కట్నం తేవాలంటూ హరికృష్ణ మల్లికను వేధించడం మొదలుపెట్టాడు
రెండు తులాల బంగారం, 5 లక్షల రూపాయలు తీసుకురావాల్సిందిగా హరికష్ణ మల్లికను వేధించేవాడు. అతడి మాట వినకపోతే శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈ వేధింపుల గురించి మల్లిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో 2023 మే 12న సింగవరం గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అప్పుడు మల్లికను బాగా చూసుకుంటానని హరికృష్ణ హామీ ఇవ్వడంతో, ఆమెను అక్కడే వదిలి తల్లిదండ్రులు వెళ్లిపోయారు.
ఇక అదే నెల అంటే మే 20వ తేదీన హరికృష్ణ తన అత్తగారింటికి వచ్చి, మీ కుమార్తె నిప్పంటించుకుందని చెప్పాడు. ఆమె తల్లి జూపల్లి జ్యోతిని బైక్పై ఎక్కించుకొని సింగవరం గ్రామానికి వెళ్తుండగా, తాండ్రపాడు వద్ద ఎదురుగా వచ్చిన ఆంబులెన్స్లో కాలిన గాయాలతో ఉన్న మల్లిక కనిపించింది. ఆమెతో మాట్లాడగా.. హరికృష్ణ ప్రతీరోజూ కట్నం కోసం గొడవ పడుతున్నాడని, తాను పని నుంచి వచ్చేలోపు చచ్చిపోవాలని కొట్టాడని, అందుకే ఒంటికి నిప్పంటించుకున్నానని మల్లిక తన తల్లికి చెప్పింది.
ఆ తర్వాత ఆమెను కర్నూలు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ అదేరోజు మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ రంగస్వామి విచారణ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీటు వేశారు. పోలీసులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు హరికృష్ణపై నేరం రుజువు కావడంతో.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa