ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపరితల ఆవర్తనం.. రెండ్రోజులు వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 09:08 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రోజు కూడా అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గురువారం రోజున నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.


మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. అకస్మాత్తుగా ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి అత్యధికంగా బాపట్లలో 61.5మిమీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో 51.7మిమీ, బొల్లవరంలో 43.5మిమీ చొప్పున వర్షం కురిసిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.


మరోవైపు ఏపీని ఇటీవలే మొంథా తుఫాను వణికించిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం మొంథా తుఫాను కారణంగా ఏపీకి మొత్తం రూ.5,244 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక కూడా అందజేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలను పంపాలని ఇటీవల కేంద్రాన్ని కోరింది.


తుఫాను కారణంగా తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మొంథా తుఫాను కారణంగా.. 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలపై ప్రభావం పడిందని.. అలాగే 48 పట్టణాలపై ప్రభావం పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa