మహిళల వన్డే ప్రపంచకప్ 2025కి గానూ.. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) మంగళవారం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును భారత్.. 52 పరుగుల తేడాతో ఓడించి.. తొలిసారి టైటిల్ను ముద్దాడింది. ఇక ఛాంపియన్గా నిలిచిన భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. రన్నరప్ దక్షిణాఫ్రికా నుంచి సైతం ఇంతే సంఖ్యలో ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఇక ఏడు సార్లు ఛాంపియన్, ఈ ఎడిషన్ సెమీఫైనల్ వరకు వచ్చిన ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి ఒకరు, పాకిస్థాన్ నుంచి ఒకరు కూడా ఈ జట్టులో ఉన్నారు. 12వ ప్లేయర్గా ఇంగ్లాండ్కు చెందిన మరొక క్రికెటర్కు అవకాశం లభించింది. అయితే టీమిండియాను ఛాంపియన్గా నిలిపిన హర్మన్ప్రీత్ కౌర్కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్డ్ ఈ జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది. బెర్త్లు పరిమితిగా ఉండటంతో ఛాంపియన్ టీమ్ కెప్టెన్కు చోటు కల్పించలేకపోయామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వివరణ ఇచ్చింది.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరంటే..
స్మృతి మంధాన (భారత్)
లౌరా వోల్వార్డ్, (కెప్టెన్, దక్షిణాఫ్రికా)
జెమీమా రోడ్రిగ్స్ (భారత్)
మారిజాన్నే కాప్ (దక్షిణాఫ్రికా)
ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా)
దీప్తి శర్మ (భారత్)
అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా)
డి క్లెర్క్ (దక్షిణాఫ్రికా)
సిద్రా నవాజ్ (వికెట్ కీపర్, పాకిస్థాన్)
అలనా కింగ్ (ఆస్ట్రేలియా)
సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్)
12వ ప్లేయర్గా ఇంగ్లాండ్కు చెందిన నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది.
భారత్ నుంచి ఎంపికైన ముగ్గురు ఆటగాళ్లలో స్మృతి మంధాన 54.25 సగటుతో 434 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జెమీమా రోడ్రిగ్స్.. 58.40 సగటుతో 292 పరుగులు చేసింది. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కొట్టింది జెమీమా. ఇక దీప్తి శర్మ 30.71 సగటుతో 215 పరుగులు చేసింది. 22 వికెట్లు పడగొట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa