ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు వెళ్లే దారిలో రోడ్డు ఉందా లేదా.... ఇకపై ఈజీగా తెలుసుకోవచ్చు.!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 07:02 PM

పాలనలో సాంకేతికతకు పెద్ద పీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరో ముఖ్యమైన ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ రహదారులను జియో రూరల్ రోడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కి అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలని పవన్ కళ్యాణ్ సూచించారు.


రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలని సూచించారు. ఈ విధంగా ఉండేలా అధునాతన సాంకేతికత సాయంతో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. 48 గంటల్లోగా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అర్టీజీఎస్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.


మరోవైపు జియో రూరల్ రోడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ పరిశీలన కోసం అడవి తల్లి బాటను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఫలితంగా ఎప్పటికప్పుడు గిరిజన గ్రామాల్లో పనుల పరోగతిని పరిశీలించే అవకాశం కలుగుతుందని అన్నారు. అడవి తల్లిబాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడడం లేదని.. పక్కా ప్రణాళికతో సవాళ్లను అధిగమించి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.


ఇందుకోసం పీఎం జన్మన్ పథకంనిధులతోపాటు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్రం సాయం మొత్తం కలిపి రూ.1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అడవి తల్లి బాట కింద మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. వీటిపై జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణం పరిష్కరించి పనులు ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa