నెయ్యిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకుని.. కాస్తా నెయ్యి వేసి తింటే అద్భుతమే! వంటల్లో మంచి ఫ్లేవర్, టేస్ట్ రావడానికి కూడా నెయ్యి విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ప్రజల అవసరాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. కల్తీ నెయ్యి తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసింది. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్య వహిస్తున్న పిఠాపురం కేంద్రంగా అక్రమ నెయ్యి దందా సాగుతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పిఠాపురంలో జంతు కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారని ఫిర్యాదుల అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల్లో జంతువుల కొవ్వును గుర్తించడం కలకలం రేపుతోంది. బుధవారం (నవంబర్ 5న) అర్ధరాత్రి పిఠాపురం పట్టణంలోని అన్నపూర్ణా థియేటర్ వెనుక.. మాధవనగర్లోని ఓ ఇంట్లో జంతు కొవ్వు నిల్వలను హిందూ సంఘాలు గుర్తించాయి. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిని సీజ్ చేశారు. గురువారం సాయంత్రం ఎస్సై మణికుమార్, ఆర్ఐ వెంకటేష్, పారిశుద్ధ్య అధికారి ప్రభాకర్ కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఆ ప్రదేశంలో 12 డబ్బాల కొవ్వు, నెయ్యి ఉన్నట్లు గుర్తించారు. నమూనాలు సేకరించి ఆహార నియంత్రణ విభాగానికి పంపించారు. మిగిలిన జంతు కొవ్వును పారిశుద్ధ్య కార్మికులతో.. భూమిలో పూడ్చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై భవన యజమాని మణికంఠపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
పిఠాపురం కేంద్రంగా గత కొంత కాలంగా కల్తీ నెయ్యి తయారవుతోందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గంలో కల్తీ నెయ్యి తయారు చేసే స్థావరాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల కొవ్వు, కల్తీ నెయ్యి గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఈ కల్తీ నెయ్యిని ఆలయాలకు సరఫరా చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
కల్తీ నెయ్యితో అనేక అనర్థాలు..
కల్తీ నెయ్యిలో అనారోగ్యకరమైన జంతు కొవ్వులు, నూనెలు కలిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. ఇలాంటి నెయ్యి తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కల్తీ నెయ్యి వల్ల అలర్జీలు కూడా వచ్చే ప్రమాదముంది. వీటిలో పోషకాలు ఉండకపోవడానికి తోడు.. శ్వాసకోస సంబంధిత వ్యాధులు తెచ్చి పెడతాయట. చర్మ వ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలపై కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa