ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.4.3 కోట్ల ప్యాకేజీ కాదని..సొంతంగా స్టార్టప్ కంపెనీ,,, రూ.540 కోట్ల ఫండ్ సేకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 07:10 PM

ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. తెలుగు కీర్తిని మరో మెట్టుకు తీసుకెళ్తున్నారు. ఎంతో మంది ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థాయిల్లో కొనసాగుతున్నారు. అలాంటి కోవకే చెందుతారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వరుణ్ వుమ్మడి . ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వరుణ్ వుమ్మడి.. రూ.4.3 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. అంతేకాకుండా ప్రతిష్ఠాత్మకమైన స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ఆఫర్‌ను కూడా తిరస్కరించాడు. గిగా అనే స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి.. 2 ఏళ్లలోనే తన ఫ్రెండ్‌తో కలిసి ఏకంగా రూ.540 కోట్ల ఫండ్స్ సేకరించాడు. ఇక గిగా స్టార్టప్ రూపొందించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌.. ఇతర వాటి కంటే తక్కువ ధరకు, మెరుగ్గా పనిచేసేలా తయారు చేశారు. దీంతో మంత్రి నారా లోకేష్.. వరుణ్ వుమ్మడిని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


భారతీయ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లు విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి కంపెనీలలో భారీ జీతాలతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో.. వరుణ్ వుమ్మడి మాత్రం.. మరో దారిని ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన వరుణ్ వుమ్మడి.. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ సీటు వచ్చింది. అంతేకాకుండా ఒక కంపెనీ నుంచి 5.25 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.4.3 కోట్ల వార్షిక జీతంతో ఉద్యోగం కూడా లభించింది.


అయితే ఈ రెండు భారీ ఆఫర్లను తిరస్కరించిన వరుణ్ వుమ్మడి.. తన ఫ్రెండ్ ఈషా మణిదీప్‌తో కలిసి గిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Giga AI) స్టార్టప్‌ను స్థాపించారు. పై చదువులు, మంచి ఉద్యోగాన్ని వదిలేసి.. స్టార్టప్ స్థాపించాలనే వారి అసాధారణ నమ్మకం కేవలం 2 ఏళ్లలోనే అద్భుతమైన విజయాన్ని అందించింది. తాజాగా.. గిగా స్టార్టప్ కంపెనీ.. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులైన రెడ్‌పాయింట్ వెంచర్స్ వంటి కంపెనీల నుంచి 61 మిలియన్ డాలర్లు (సుమారు రూ.540 కోట్లు) భారీ సిరీస్-ఏ ఫండింగ్‌ను సేకరించి సంచలనం సృష్టించింది.


ఇక వరుణ్ వుమ్మడి తీసుకున్న నిర్ణయం, సాధించిన ఈ భారీ విజయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వరుణ్‌ వుమ్మడిని అభినందించిన నారా లోకేష్.. విజయవాడకు చెందిన వరుణ్ వుమ్మడికి బిగ్ హ్యాట్ టిప్. ఆంధ్రప్రదేశ్ చాలా గర్వపడుతోందని పేర్కొన్నారు.


ఇక వరుణ్ వుమ్మడి, ఈషా మణిదీప్ స్థాపించిన గిగా సంస్థను.. ఏఐ టెక్నాలజీ ద్వారా కస్టమర్ ఆపరేషన్లను పూర్తిగా ఆటోమేట్ చేయడమే లక్ష్యంగా రూపొందించారు. కేవలం సాధారణ ఏఐ చాట్‌బాట్‌ల మాదిరిగా కాకుండా.. ఈ గిగా మోడల్స్‌కు మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. గిగా ఫైన్ ట్యూన్డ్ మోడల్స్, జీపీటీ-4 ఏపీఐ కంటే 3 రెట్లు వేగంగా పనిచేస్తాయి. 70 శాతం తక్కువ ఖర్చుతో అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.


సాధారణంగా ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, లీగల్ వంటి రంగాల్లో ప్రైవసీ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఈ గిగా మోడల్స్ ఈ డేటా ప్రైవసీని కాపాడుతూనే.. ఆయా సంస్థలకు సరిపోయే కస్టమ్ ఏఐని అందిస్తాయి. ఈ గిగా ఏఐ ఏజెంట్లు మల్టీ పర్పస్ కన్వర్జేషన్స్, పలు లాంగ్వేజ్‌లను కూడా మేనేజ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ గిగా సంస్థ అందించే సర్వీసుల పట్ల ఆసక్తికనబరిచిన డూర్‌డ్యాష్  వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ సేవలను ఉపయోగించుకుంటున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa