మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు రాష్ట్రాల పర్యటన తప్పదా.. ఆయన పదే పదే మూడు రాష్ట్రాలను సందర్శించాల్సి ఉంటుందా.. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక్లలో ఓటమి తర్వాత వైఎస్ జగన్ బెంగళూరులోని యలహంక నివాసానికి మారారు. అక్కడే ఉంటున్నారు. పార్టీ తరుఫున ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నా.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సి ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు జగన్. ఇక రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారిన తొలినాళ్లల్లో వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ బెంగళూరు నుంచి వచ్చేవారు. కూటమి సర్కారుకు హనీమూన్ పీరియడ్ ముగిసిన తర్వాత సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నించేందుకు వైసీపీ ప్రతివారం ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపడుతోంది. దీంతో వైఎస్ జగన్ బెంగళూరు నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. అయితే ఇకపై వైఎస్ జగన్ తెలంగాణకు కూడా వెళ్లాల్సి ఉంటుందా.?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసుల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ జగన్ను 2012 మే 27న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం 16 నెలల పాటు జగన్ జైలులో ఉన్నారు. సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో 2013 సెప్టెంబరు 24న వైఎస్ జగన్ జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనలను వెళ్లాల్సిన సమయంలో కోర్టు నుంచి జగన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద కుమార్తెను చూడటానికి లండన్ వెళ్లిన వైఎస్ జగన్.. నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుని వెళ్లారు. అయితే అనుమతి ఇచ్చే సమయంలో హైదరాబాద్ సీబీఐ కోర్టు కొన్ని షరతులు విధించింది.
లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని వైఎస్ జగన్ను సీబీఐ కోర్టు ఆదేశించింది. ఇందుకోసం నవంబర్ 14 వరకూ గడువు విధించింది. అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వైఎస్ జగన్ తాజాగా సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. వ్యక్తిగతంగా తాను కోర్టు ముందు హాజరవ్వాలంటే అందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని మెమోలో జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలంటే యంత్రాంగానికి భారమని వైఎస్ జగన్ పేర్కన్నారు. కోర్టు తప్పనిసరిగా హాజరుకావాలంటే.. హాజరయ్యేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ప్రత్యామ్నాయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ జగన్ కోరారు. అలాగే ఈ కేసులో తన తరుఫున వకాల్తా న్యాయవాది హాజరయ్యేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
అయితే వైఎస్ జగన్ దాఖలు చేసిన మెమో ప్రస్తుతం నాంపల్లి సీబీఐ కోర్టు పరిశీలనలో ఉంది. కోర్టు జగన్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించకపోతే.. వైఎస్ జగన్ నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ సీఎం అయిన తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రిగా అధికారిక విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన హైకోర్టు.. జగన్ తరుఫున ఆయన న్యాయవాది హాజరు అయ్యేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ విపక్షంలో ఉండటంతో.. సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుటుందనేదీ చూడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa