ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 07:18 PM

రాష్ట్రంలోని దేవాలయాల్లో జరిగిన దుర్ఘటనలు, తొక్కిసలాట ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. గడిచిన ఏడాది కాలంలో మూడు ప్రధాన ఆలయాల్లో దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట, ఆ తర్వాత సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించడం.. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ తరహా ఘటనలు రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆలయాల్లో తొక్కిసలాటలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోనుంది.


ఈ కేబినెట్ సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖను ఆదేశించింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు, ఈ దాడులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ పర్యవేక్షించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.


మరోవైపు కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్ఫంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావటంతో తోపులాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తోపులాట కాస్త తొక్కిసలాటకు దారి తీసి.. 9 మంది భక్తులు చనిపోయారు. భక్తుల సంఖ్యను అంచనా వేయలేకపోవటం, ముందస్తు చర్యలు చేపట్టకపోవటం వంటి కారణాలతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని.. ప్రైవేట్ ఆలయమని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రైవేట్ ఆలయాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa