ఇటలీలో జరిగిన ఒక భయంకరమైన మోసం కేసు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. మూడేళ్ల క్రితం మరణించిన తన తల్లి పింఛనును అక్రమంగా కాజేయడానికి.. ఆమె కుమారుడు దారుణానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా ఆమె చనిపోయిన విషయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే మృతదేహాన్ని మమ్మీగా మార్చేసి దాచేశాడు. ఆపై తన తల్లిలా వేషం మార్చుకుని అప్పుడప్పుడూ స్థానికులకు కనిపించేవాడు. ఇలా మూడేళ్లుగా అందరినీ మోసం చేస్తూ ఆమె పింఛన్ను పొందాడు. మొత్తంగా రూ.80 లక్షలు దోచేసి చివరకు పట్టుబట్టాడు. మరెలా దొరికిపోయాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అసలేం జరిగిందంటే..?
ఇటలీలోని బోర్గో వర్జీలియోకు చెందిన 56 ఏళ్ల మంటోవా.. తన తల్లి గ్రాజియెల్లా డాల్ ఓగ్లియోతో కలిసి జీవనం సాగించేవాడు. గతంలో ఆయన ఓ ఆస్పత్రిలో పని చేసేవాడు. కానీ కొన్నేళ్ల క్రితం నుంచి ఆ పని మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇలాంటి సమయంలోనే అంటే మూడేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మంటోవా తల్లి గ్రాజియెల్లా డాల్ ఓగ్లియో మరణించారు. అయితే ఆ విషయం గుర్తించిన మంటోవా.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అలా చెప్తే తన తల్లికి వచ్చే పెన్షన్ పోతుందని.. తన బతుకు గడవడం కష్టంగా మారుతుందని భావించాడు. అందుకోసం తన తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. ఇంట్లోనే మృతదేహాన్ని దాచాలనుకున్నాడు. కానీ అలాగే ఉంచేస్తే వాసన వస్తుందని భావించి.. తల్లి శవాన్ని "మమ్మీ"లా మార్చేశాడు.
ఇక ఆమె ఏమైపోయిందోనన్న అనుమానం ఎవరికీ రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ ఆమెలా కనిపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అచ్చంగా తల్లిలాంటి హెయిర్ కట్ ఉన్న విగ్, మేకప్, ఫేస్ మాస్క్ వంటివి తయారు చేయించుకున్నాడు. వాటిని ధరించి, ముస్తాబై అప్పుడప్పుడూ బయటకు వెళ్లేవాడు. అలాగే ఆమెలాగే పెన్షన్ కోసం వెళ్లి.. నెలా నెలా డబ్బులు తెచ్చుకునేవాడు. గత మూడేళ్లుగా ఆయన ఇలాగే చేస్తూ.. రూ.80 లక్షలు దోచేశాడు. ఇదంతా బాగానే ఉండగా.. ఓ ఉద్యోగికి వచ్చిన చిన్న అనుమానం కారణంగా మంటోవా బాగోతం బట్టబయలు అయింది.
స్థానిక రిజిస్ట్రీ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగికి.. పింఛను కోసం తల్లి రూపంలో వచ్చిన మంటోవాను చూడగానే అనేక అనుమానాలు కల్గాయి. ముఖ్యంగా అతడికి.. ఆమె మెడ అసాధారణంగా బలంగా కనిపించింది. అలాగే ముఖంపై ముడతలు సహజంగా అనిపించలేదు. చేతులపై చర్మం వృద్ధురాలి చర్మంలా కాకుండా.. భిన్నంగా ఉండడాన్ని కూడా ఉద్యోగి కనిపెట్టాడు. ఆమె గొంతులో ఆడతనం ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు మగగొంతు వినిపించేది. వీటన్నింటినీ పసిగట్టిన రిజిస్ట్రీ క్లర్క్.. విషయాన్ని మేయర్ ఫ్రాన్సెస్కోకు తెలియజేశాడు.
దీంతో ఆయన ఆ మరుసటి రోజే మంటోవాను.. పింఛను ఫారాలు నింపడం కోసం ఆఫీసుకు తీసుకురమ్మని ఓ వ్యక్తిని ఇంటికి పంపాడు. అయితే మంటోవా ఆరోజే ఆఫీసుకు వెళ్లలేదు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో అధికారులకు అనుమానం వచ్చి నేరుగా ఆయన ఇంటికి వెళ్లి సోదా చేశారు. అక్కడే మంటోవా తల్లి మృతదేహాన్ని భద్రపరిచి ఉండడాన్ని గమనించారు. అంతే కాకుండా అతడి తల్లి హెయిర్ స్టైల్లా ఉండే విగ్, ఆమెలాంటి డ్రెస్సులు, ఫేస్ మాస్క్ మొదలైన వాటిని గుర్తించారు. దీంతో తమదైన స్టైల్లో మంటోవాను విచారించగా.. అతడు నేరం ఒప్పుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అలాగే నిందితుడిపై మృతదేహాన్ని దాచడం, మారువేషధారణ, పత్రాలను ఫోర్జరీ చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోసం వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. అలాగే అతడి తల్లి మరణానికి కారణం తెలుసుకోవడానికి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa