పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఇమ్రాన్ ఖాన్ మరణ వదంతులపై.. ఆయన కుమారుడు ఖాసీం ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 845 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంలో ఉండగా.. గత ఆరు వారాలుగా ఆయనను పూర్తిగా ఏకాంతంగా 'డెత్ సెల్'లో ఉంచారని అన్నారు. అయితే ఆయన చనిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం, కనీసం తమ కుటుంబ సభ్యులను కూడా ఆయన్ను చూడడానికి, మాట్లాడానికి అంగీకరించకపోవండ చూస్తుంటే తమకూ అనుమానంగానే ఉందన్నారు. అయితే ఆయన బతికున్నట్లుగా తమకు ఆధారాలు చూపించాలని ఖాసీం ఖాన్ జైలు అధికారులను, పాక్ ప్రభుత్వాన్ని కోరారు.
'డెత్ సెల్'లో ఇమ్రాన్ ఖాన్..
గత 845 రోజులుగా తన తండ్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారని ఖాసీం ఖాన్ వివరించారు. అయితే గత నెల రోజుల నుంచి తనను, తన కుటుంబ సభ్యులను ఆయన్ను చూసేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ అనుమతించడం లేదని చెప్పారు. కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులను సైతం ఆయన్ని కలిసేందుకు అనుమతించ లేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎలాంటి ఫోన్ కాల్స్, సమావేశాలకు కూడా అవకాశం ఇవ్వలేదని తెలిపారు. కుటుంబ సభ్యులకు కూడా ఆయన క్షేమం గురించి ఎలాంటి సమాచారం అందకుండా పూర్తిగా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి క్షేమం, ఈ అమానవీయ నిర్బంధం పరిణామాలకు పూర్తి చట్టపరమైన, నైతిక అంతర్జాతీయ బాధ్యతను పాకిస్థాన్ ప్రభుత్వం, అధికారులు భరించాల్సి ఉంటుందని ఖాసీం ఖాన్ హెచ్చరించారు. కేవలం రాజకీయ కారణాల వల్లనే నిర్బంధించబడిన పాకిస్థాన్ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిని విడుదల చేయాలని.. ఈ అమానవీయ ఏకాంతాన్ని తక్షణమే ముగించాలని అంతర్జాతీయ సమాజానికి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలకు, ప్రతి ప్రజాస్వామ్యవాదికి విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నారని ధృవీకరణ ఇవ్వాలని.. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన తమకు ఏవైనా ఆధారాలు చూపించాలని ఖాసీం ఖాన్ జైలు అధికారులను, పాక్ ప్రభుత్వాన్ని కోరారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కుటుంబానికి ఆయన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని రోజులగా ఆయన మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్థాన్ విదేశాంగ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా.. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ను చంపేశారని వార్తలు వస్తున్నట్లు తెలిపింది. దీంతో అనేక మీడియా సంస్థలు ఈ వార్తలను ప్రచురించాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు.. తమ సోదరుడిని కలిసేందుకు వెళ్లారు. అక్కడే పోలీసులు అన్యాయంగా తమపై దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాతి రోజే జైలు అధికారులు స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని ప్రకటించింది.
ముఖ్యంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సైతం దీనిపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్కు ఫైవ్ స్టార్ హోటళ్లో కంటే మంచి వసతులు కల్పిస్తున్నామని, నాణ్యమైన, మెరుగైన ఆహారం పెడుతున్నామని చెప్పారు. ఆయన చాలా క్షేమంగా ఉన్నారని వివరించారు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీం ఖాన్ వీటిని నమ్మకుండా.. ఆయన బతికే ఉంటే అందుకు ఆధారాలు చూపించమని కోరడంతో.. మళ్లీ అనుమానాలు తలెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa