ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పెయిన్ కిల్లర్స్ మాత్రలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 09:42 PM

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా నొప్పి, జ్వరం కోసం వాడే 'నిమెసులైడ్' అధిక మోతాదు మాత్రలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.


డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A ప్రకారం.. 100 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ మోతాదు ఉన్న నిమెసులైడ్ ఓరల్ ఫార్ములేషన్ల తయారీ, విక్రయం, పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిమెసులైడ్ అనేది నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. దీనిని అధిక మోతాదులో వాడటం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందని, మానవ శరీరానికి ఇది హానికరమని నిపుణులు తేల్చారు. మార్కెట్‌లో దీనికి సమానమైన సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉండటంతో ఈ హై-రిస్క్ డ్రగ్‌ను పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 100 ఎంజీ కంటే తక్కువ మోతాదు ఉన్న మందులకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు.


తాజా ఆదేశాలతో ఫార్మా కంపెనీలు సదరు బ్యాచ్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని సర్కారు సూచించింది. ప్రముఖ కంపెనీల ఆదాయంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే మొత్తం పెయిన్ కిల్లర్ల అమ్మకాల్లో నిమెసులైడ్ వాటా చాలా తక్కువ. అయితే కేవలం ఈ డ్రగ్ తయారీ పైనే ఆధార పడిన చిన్న తరహా ఫార్మా కంపెనీలు మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మరోవైపు ఔషధ తయారీలో వినియోగించే ముడి పదార్థాల (API) కోసం ఇతర దేశాలపై ఆధార పడటాన్ని తగ్గించేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2025 సెప్టెంబర్ నాటికి బల్క్ డ్రగ్ పార్కుల పథకం కింద రూ. 4,763.34 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆరేళ్ల కాలంలో రూ. 4,329.95 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం మూడున్నర ఏళ్లలోనే ఆ లక్ష్యాన్ని అధిగమించడం విశేషం.


నిర్దిష్ట ఏపీఐల సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి రూ. 6,940 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో PLI పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని వల్ల కీలకమైన ఔషధాల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా.. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa