ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ పని మీరు చూసుకోండి.. న్యూయార్క్ మేయర్ మమ్దానీపై భారత్‌‌ విమర్శలు

national |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 09:42 PM

ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు, జైల్లో ఉన్న ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ లేఖ రాయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర ప్రజాస్వామ్య దేశాల న్యాయవ్యవస్థలను గౌరవించాలని, తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. గత నెలలో ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులను కలిసిన మమ్దానీ.. వారికి ఒక లేఖను అందించారు. ఆ లేఖలో ఖలీద్‌కు తన మద్దతును తెలిపారు. ‘ప్రియమైన ఉమర్, నీ చేదు అనుభవాల గురించి, అది నిన్ను ఆవహించకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నేను తరచూ ఆలోచిస్తాను. మీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం’ అని మమ్దానీ పేర్కొన్నారు.


  ఈ లేఖపై భారత్ స్పందిస్తూ.. ‘ఇతర ప్రజాస్వామ్య దేశాల న్యాయవ్యవస్థల స్వాతంత్య్రాన్ని గౌరవించాలని మేము ప్రజా ప్రతినిధులను ఆశిస్తున్నాం... వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయడం పదవుల్లో ఉన్నవారికి తగదు. అలాంటి వ్యాఖ్యలకు బదులుగా అప్పగించిన బాధ్యతలపై దృష్టి పెట్టడం మంచిది’ అని జైస్వాల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా 2023 జూన్‌లో జరిగిన నిరసనలో పాల్గొన్న జోహ్రాన్ మమ్దానీ.. ఖలీద్ డైరీలోని కొన్నింటిని చదివి వినిపించారు. ఖలీద్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు.


ఉమర్ ఖలీద్ తండ్రి సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్, డిసెంబర్ 9న మమ్దానీని కలిసి, సుమారు 25 నిమిషాలు మాట్లాడారు. ఖలీద్ జైలు డైరీని చదివినందుకు మమ్దానీకి ధన్యవాదాలు చెప్పడానికి కలిసినట్టు తెలిపారు. ‘ఉమర్ జైలు జీవితం గురించి తాను ఎప్పుడూ ఆలోచిస్తానని, అతనికి ఇప్పుడు బెయిల్ రావాలని మమ్దానీ అన్నారని’ ఖలీద్ తండ్రి తెలిపారు. ఈ విషయంలో తాను ఏమి చేయగలనని మమ్దానీ అడిగితే.. ‘ప్రార్థించండి’ అని మాత్రమే తాను చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు.


ఫిబ్రవరి 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ దాదాపు ఐదేళ్లుగా జైల్లో ఉన్నారు. తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు డిసెంబర్ 16 నుంచి 29 వరకు అతనికి బెయిల్ మంజూరైంది. ఈ అల్లర్లలో 53 మంది చనిపోగా.. 200 మందికిగాపై గాయపడ్డారు. ఇక, ఢిల్లీ అల్లర్ల కేసులో ఇటీవలే ఐదుగురు నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, విద్యార్థి నేతలు షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్‌లకు మాత్రం బెయిల్ నిరాకరించింది. అపరాదం విషయంలో నిందితులందర్నీ ఒకే గాటాన కట్టలేమని, విచారణలో జరిగిన జాప్యం కారణంగా వారికి ప్రయోజనం కల్పించలేమని తేల్చిచెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa