ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఫేమ్ కోసం, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొందరు ప్రవర్తించే తీరు అత్యంత అసహ్యకరంగా ఉంటుంది. తాజాగా, బస్సులో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇన్ఫ్లూయెన్సర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ కాగా.. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. కేరళకు చెందిన షింజిత ముస్తాఫా అనే ఇన్ఫ్లూయెన్సర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వస్త్రదుకాణంలో పనిచేసే కోజికోడ్ జిల్లాకు చెందిన గోవిందపురానికి చెందిన దీపక్ అనే వ్యక్తి గతవారం కన్నూర్కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న షంజిత.. దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఈ వీడియో దీపక్ దృష్టిలో పడటంతో అతడు కలతచెందిన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం షింజిత పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. అలాగే, మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపై స్పందించింది. సమగ్ర దర్యాప్తు చేసి వారంలోపు నివేదిక అందజేయాలని డీఐజీని ఆదేశించింది. వచ్చే నెల 19న కమిషన్ ఈ కేసును పరిశీలించనుంది. సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకుని తద్వారా ఆర్థిక ప్రయోజనం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ధోరణులు పెరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక, తాను గతంలో వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశానని షింజితా చెప్పినప్పటికీ, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. దీపక్ మరణం తర్వాత, షింజితా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారు. ఇన్ఫ్లుయెన్సర్ షేర్ చేసిన వీడియోలో ‘నిన్న, ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి నా అనుమతి లేకుండా నన్ను ఉద్దేశపూర్వకంగా తాకిన వీడియోను షేర్ చేశాను. ఇది ప్రమాదం కాదు, అపార్థం కాదు. ఇది నా లైంగిక హద్దులను స్పష్టంగా ఉల్లంఘించడమే’ అని పేర్కొంది.
‘నా ముందున్న మహిళ అసౌకర్యంగా ఉన్నట్లు గమనించిన తర్వాత నేను రికార్డింగ్ చేయడం ప్రారంభించాను. తాను రికార్డ్ అవుతున్నానని తెలిసినా, ఆ వ్యక్తి నన్ను తాకాడు. ఇది ఉద్దేశపూర్వక చర్య, కొంచెమైనా భయం లేకపోవడం, ఎలాంటి పరిణామాలు ఉండవనే నమ్మకాన్ని చూపుతుంది.’ అని ఆమె అన్నారు.
శుక్రవారం ఈ వీడియో వైరల్ కాగా.. మర్నాడు శనివారం దీపక్ పుట్టినరోజు. ఇంటర్నెట్లో వీడియో వైరల్ అయిందని తెలిసి ఆ రోజు ఏమీ తినలేదని అతని తల్లి తెలిపారు. జరిగిన విషయం గురించి తన తల్లికి చెప్పాడని, ఆమె ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పిందని బంధువులు అన్నారు. తన స్నేహితుడితో కూడా ఈ విషయం గురించి వివరంగా చర్చించాడు. ఆదివారం ఉదయం ఇంటిలో దీపక్ మృతదేహాన్ని కనుగొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa