పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి భక్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. శివరాత్రి ఉత్సవాలలోపు రహదారి సౌకర్యం కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తూ... కోటప్పకొండ - కొత్తపాలెం గ్రామాల మధ్య నిర్మించిన నూతన రహదారిని గురువారం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. రూ.3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించారు.కోటప్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఆ తర్వాత రోడ్డుపై కొంత దూరం నడిచి, నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలించారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు ఈ రోడ్డు ఆవశ్యకతను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్, శివరాత్రి నాటికి రోడ్డును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ నూతన రహదారితో మహాశివరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. అంతేకాకుండా, కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడనుంది. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పవన్ కల్యాణ్ను కలిసి, తమ కోసం రహదారి నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పాఠశాలకు క్రీడా మైదానంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa