ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లూరి జిల్లాలో 120 ఏళ్లు పూర్తి చేసుకున్న పాఠశాల,,,,ఏప్రిల్ నెలలో శతాబ్ధి ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 07:38 PM

ఈ రోజులలో ప్రభుత్వ పాఠశాల నిర్వహణ అంటే కత్తి మీద సామే.. విద్యార్థులు అందరూ ప్రైవేట్ బడుల బాట పడుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ పాఠశాలలను సమీపంలోని పాఠశాలలో విలీనం చేయడమే.. లేక పూర్తిగా మూసివేయడమో చేస్తున్న పరిస్థితి. కానీ ఓ పాఠశాల 120 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తోందనే సంగతి మీకు తెలుసా. అది కూడా ఏ పట్టణంలోనో, నగరంలోనో కాదు.. ఓ మారుమూల ప్రాంతంలో. బ్రిటీష్ హయాంలో ఏర్పాటైన ఆ పాఠశాల.. ఇప్పటికీ 200 మందికిపైగా విద్యార్థులకు బోధన అందిస్తోంది. త్వరలోనే శతాబ్ధి ఉత్సవాలకు ముస్తాబవుతోంది.


అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్ మండలంలో కిలగడ అనే ఓ చిన్న గిరిజన గ్రామం. ఈ ఊరిలోని పాఠశాల త్వరలోనే 120 ఏళ్ల పండుగ జరుపుకోనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కిలగడ ప్రభుత్వ పాఠశాల వందేళ్ల వేడుక జరుపుకోనుంది. ఏప్రిల్ 14,15 తేదీలలో ఈ వేడుకను నిర్వహించేందుకు పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో కిలగడలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది. బ్రిటీష్ వారు ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. మొదట్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. అది కూడా గుడిసెలలో.. ముంచింగిపుట్, పెదబయలు మండలాల పరిధిలో ఇదే మొదటి విద్యాసంస్థగా చెప్తుంటారు.


కాలక్రమంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రైవేట్ స్కూళ్లు కూడా వెలిశాయి. కానీ కిలగడ ప్రభుత్వ పాఠశాలకు దీటుగా రాలేకపోయాయి. ప్రైవేట్ బడులు ప్రారంభమైనప్పటికీ.. ఈ సర్కారీ బడికి మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. ఇన్నేళ్లుగా కిలగడ పాఠశాల గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వస్తోంది. రోడ్డుకు కిలగడ పాఠశాలకు సుమారుగా రెండు కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. అయినప్పటికీ విద్యార్థులకు రోజూ నడుచుకుంటూ ఈ స్కూలుకు వెళ్తున్నారంటే ఈ స్కూలులో విద్యాప్రమాణాలు ఎంత మెరుగ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


కిలగడకు చెందిన కొండయ్య అనే 85 ఏళ్ల పెద్దాయన.. ఇదే స్కూలులో చదువుకున్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా మారి ఇదే పాఠశాలలో చాలా ఏళ్లు పనిచేశారు. చివరకు ఇదే స్కూలులో రిటైర్ కావటం విశేషం. కిలగడ పాఠశాల.. విద్యాసంస్థ కంటే ఎక్కవని, ఇది వారసత్వానికి చిహ్మమని చెప్తున్నారు. త్వరలో జరిగే శతాబ్ధి ఉత్సవాల్లో తాను కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు.


కిలగడ పాఠశాల కేవలం కొంతమంది విద్యార్థులు, ఒకే ఒక టీచర్‌తో ప్రారంభమైంది. కొన్నేళ్ల తరువాత ఈ పాఠశాలను ఏడో తరగతి వరకూ అప్‌గ్రేడ్ చేశారు. 1990లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా మారింది. పదో తరగతి వరకూ విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. ప్రస్తుతం ఈ పాఠశాల ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ గవర్నమెంట్ మోడల్ ప్రైమరీ స్కూల్‌గా, ఆరు నుంచి పదో తరగతి వరకూ గవర్నమెంట్ హైస్కూలుగా సేవలు అందిస్తోంది.


గడిచిన పది దశాబ్దాల కాలంలో ఈ స్కూలులో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు గొప్ప గొప్ప హోదాలలో స్థిరపడ్డారు. ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, బ్యాంకర్లు, పోలీసులు.. ఇలా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 220 మంది విద్యార్థులు చదువుతున్నారని స్కూలు అధికారులు వెల్లడించారు. త్వరలో జరిగే శతాబ్ధి వేడుకలకు పూర్వ విద్యార్థులు కూడా హాజరుకానున్నట్లు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa