కర్ణాటక, చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించలేదని, తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్ధారిస్తూ ఆయన ఎన్నికను రద్దు చేసింది.2023 ఎన్నికల్లో సుబ్బారెడ్డి చేతిలో ఓటమిపాలైన బీజేపీ అభ్యర్థి సి. మునిరాజు ఈ ఫలితాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి తన నామినేషన్ అఫిడవిట్లో పదుల సంఖ్యలో ఆస్తుల వివరాలను దాచిపెట్టారని, అందువల్ల ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం, సుబ్బారెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పిటిషనర్ అయిన మునిరాజును ఎమ్మెల్యేగా ప్రకటించాలన్న అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తోసిపుచ్చింది.ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు వీలుగా స్టే విధించాలని సుబ్బారెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, తీర్పుపై మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో సుబ్బారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa