కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది. సర్వీస్ ఛార్జ్ అనేది కచ్చితంగా చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఇక్కడ ఏదైనా రెస్టారెంట్లు, హోటల్స్ సహా ఇతర మాల్స్ వంటివి సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని బలవంతం చేస్తే.. బిల్లులో దానిని చేర్చితే కేంద్ర మంత్రిత్వ శాఖకు నేరుగా హెల్ప్ లైన్ నంబర్ లేదా వాట్సాప్కు ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేసింది. ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్ 1915 కాగా.. వాట్సాప్ నంబర్ 8800001915 అని తాజాగా కన్జూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ట్విట్టర్లో వివరాల్ని వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
>> ఇక్కడ సర్వీస్ ఛార్జ్ అనేది యజమానులు నేరుగా బలవంతంగా కస్టమర్లపై రుద్దకూడదని స్పష్టం చేసింది. సర్వీసుపై కస్టమర్లు సంతృప్తి చెందితే వారి ఇష్టానుసారంపై సర్వీస్ ఛార్జ్ అనేది చెల్లించాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని.. దీనిని కస్టమర్ల అనుమతి లేకుండా బిల్లులో కూడా యాడ్ చేయొద్దని పేర్కొంది. బలవంతంగా రెస్టారెంట్లు.. సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తే దాన్ని తిరిగి పొందే వీలు కల్పిస్తోంది వినియోగదారుల మంత్రిత్వ శాఖ. ఇటీవల ముంబై, పట్నాలోని రెండు రెస్టారెంట్లు ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల నుంచి బిల్లులో 10 శాతం వరకు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తే.. తిరిగి చెల్లించాలని కోర్టులు ఆదేశించాయి. ఇంకా అదనంగా సదరు రెస్టారెంట్లపై పెనాల్టీ కూడా విధించాయి.
కస్టమర్లు చేసే ఫిర్యాదుల ఆధారంగా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) వాటిని పరిశీలించి నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటోంది. రెస్టారెంట్లు బిల్లులో సర్వీస్ ఛార్జ్ తొలగించకపోతే.. కస్టమర్లకు చట్టం ఎన్నో స్పష్టమైన హక్కులు, ఇతర ఆప్షన్లు కల్పించిందని ముంబైకి చెందిన యూనివర్సల్ లీగల్ ఫౌండర్ అపూర్వ అగర్వాల్ చెప్పారు. సమయానికి తగ్గట్లుగా ఏదైనా ఉత్తమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
అగర్వాల్ ప్రకారం.. ఇక్కడ ఒకటి మెనూ ప్రైస్ ప్లస్ జీఎస్టీ మాత్రమే వసూలు చేయాలని రెస్టారెంట్లకు చెప్పాలి. సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) మార్గదర్శకాలు కూడా ఇదే చెబుతోంది. ఇక్కడ సర్వీస్ ఛార్జ్ బిల్లులో యాడ్ చేస్తే.. దాన్ని తీసేసి ఛార్జ్ సవరించాలని కోరొచ్చు.
వారితో గొడవ వద్దనుకుంటే.. సర్వీస్ ఛార్జీతో సహా మొత్తం చెల్లించి.. అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని.. ఆధారాలతో వారి తప్పును వారికి తెలియజేయాలి. బిల్లులో సర్వీస్ ఛార్జిని పేర్కొంటే దాని ఫొటో వంటి ప్రూఫ్ కచ్చితంగా ఉండాలి. అప్పుడు కంప్లైంట్ ఇవ్వొచ్చని.. ఇది కస్టమర్ల హక్కుల్ని కాపాడేలా చేస్తుందని అన్నారు.
కొన్ని రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జ్ స్థానంలో స్టాఫ్ ఫండ్, ఫెసిలిటీ ఛార్జ్, అదర్ ఛార్జెస్ పేరిట అదనంగా వసూలు చేస్తుంటాయని.. వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని అగర్వాల్ చెబుతున్నారు. సీసీపీఏ గైడ్ లైన్స్ ప్రకారం.. సర్వీస్ ఛార్జ్ లేదా ఏ ఇతర ఛార్జీల్ని కూడా రెస్టారెంట్లు వసూలు చేసేందుకు వీల్లేదని ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa