ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు...మండలిలో ఛైర్మన్ వర్సెస్ అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 06:17 PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై బుధవారం రోజున ఏపీ శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. చర్చ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్రిస్టియన్ అని.. అందుకే ఆయనకు ఇవేవీ పట్టడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇదే క్రమంలోనే శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు..మీరూ క్రిస్టియనే అని అనడంతో... మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం తెలిపారు. తన కులం గురించి మాట్లాడటం సరికాదంటూ మోషేన్ రాజు సీరియస్ అయ్యారు. ఇలా మాట్లాడటం తన వ్యక్తిత్వాన్ని కించపరచటమేనంటూ మండలి ఛైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.


తాను క్రిస్టియన్ కాదని.. హిందువునేనంటూ మోషేన్ రాజు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు చేసిన వ్యా్ఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభకు అంతరాయం కలిగింది.


 వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న అచ్చెన్నాయుడు


మరోవైపు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు క్రిస్టియన్ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు వెనక్కుతగ్గారు. ఆయన హిందువు అనే విషయం తనకు తెలియదని.. ఛైర్మన్ స్వయంగా సభలో తాను హిందువునేని ఒప్పుకున్న నేపథ్యంలో.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. దీనికి మండలి ఛైర్మన్ సైతం అంగీకరించారు. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవటంపై తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే వైసీపీ సభ్యులు నినాదాలను కొనసాగించటంతో మండలిని ఐదు నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ.. వైసీపీ సభ్యుల నినాదాలు కొనసాగాయి.


మరోవైపు చర్చ సందర్భంగా వైఎస్ జగన్‌కు వెంకటేశ్వరస్వామిపై ఏ మాత్రం నమ్మకం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తిరుమల వెంకటేశ్వరస్వామిపై జగన్ ఎందుకు ఇంతలా కక్ష కట్టారో తెలియడం లేదని.. వైసీపీ వాళ్లే దీనికి సమాధానం చెప్పాలన్నారు. జగన్ క్రిస్టియన్ అన్న అచ్చెన్నాయుడు. ఈ విషయాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు. ఎవరి మతవిశ్వాసాలు వారివని అన్నారు. అయితే ప్రభుత్వం తమ చేతిలో ఉంది కదా అని..దేవుడి ప్రసాదం అపవిత్రం చేయడం ఏమిటంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa