ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిస్తున్న అమృతభూమి సినిమాలో అధికారి పాత్రలో కలెక్టర్ డా.హరిజవహర్లాల్ నటించారు. మండలంలోని తోటపల్లిలోని ప్రకృతి ఆదిదేవోభవ ప్రాంగణంలో పలు సన్నివేశాలను ఆదివారం చిత్రీకరించారు. ఏపీ రైతు సాధికార సంస్థ, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సహకారంతో జట్టుటస్టీ డి.పారినాయుడు పర్యవేక్షణలో సినిమా నిర్మాణం జరుగుతోంది. సినీ రచయిత వంగపండు ప్రసాదరావు ప్రకృతి వ్యవసాయం ఇతివృత్తంగా ఈ కథను రచించారు. షూటింగ్లో కలెక్టర్ పాల్గొనడంతో చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సేంద్రియ ఎరువులను వినియోగించి ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రసాద్బాబు, టీవీ ఆర్టిస్ట్ దయబాబు, కెమెరామెన్ మురళి, ఆర్ట్ డైరెక్టర్ శివ, సహదర్శకుడు రౌతు వాసుదేవరావుతో పాటు నటీనటులు ప్రసాద్బాబు, లక్ష్మి, స్వప్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa