ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ధ్వజారోహణంతో శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 05:00 AM

తిరుమ‌ల తిరుప‌తి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు అలివేలు మంగ ప‌ద్మావ‌తీ స‌మేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తిరుమలకు శోభ తీసుకొచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా నిర్వహిస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవాలని పిలుస్తారని పురాణోక్తి. ఏటా కన్యామాసంలో వచ్చే స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రానికి ముగిసేలా ఈ ఉత్సవాలను నిర్వహించ‌డం వైఖాసన ఆగమ సంప్రదాయం. తొమ్మిది రోజులపాటు పగలు, రాత్రి వివిఽధ వాహనాలపై స్వామివారు విహరిస్తూ భక్తకోటిని కటాక్షిస్తారు. ఈనెల 30వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు 29న అంకురార్పణ జరగనుంది. ఆరోజు సాయంత్రం 5-7 గంటల మధ్య శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన సేనాధిపతిని సర్వాంగసుందరంగా అలంకరించి విశేష సమర్పణ చేస్తారు.
అనంతరం తిరుచ్చి వాహనంలో ఆశీనులు చేస్తారు. ఆలయం నుంచి బయల్దేరి నాలుగు మాడవీధుల ఊరేగింపు ఉత్సవం ప్రారంభిస్తారు. ప్రదక్షిణగా పడమర మాడవీధిలోని వసంత మండపానికి వేంచేస్తారు. అక్కడ పుట్టమన్నును సేకరించి నవపాలికలలో భద్రపరుచుకుంటారు. అనంతరం మిగిలిన మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలకు వేంచేసిన తరువాత అర్చకస్వాములు సంప్రదాయ కైంకర్యాల నడుమ అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతారు. మరుసటిరోజు సోమవారం సాయంత్రం 5.23 నుంచి 6గంటల మధ్య ధ్వజారోహణం జరగనుంది. ఆరోజు రాత్రి 9గంటలకు పెద్దశేషవాహన ఊరేగింపు మొదలవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa