ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు తిరుపతివాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా మొదటిరోజైన సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు కాకినాడకు చెందిన శ్రీ ఎ.శివప్రసాద్ బృందం చక్కటి భక్తి సంగీతం వినిపించారు.
అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు డా. శబరిగిరీష్ బృందం భక్తి సంకీర్తనలు వినిపించారు. ఇందులో వేంకటాద్రి సమంస్థానం…, పార్థాయ ప్రతిబోధితాం…. శ్లోకాలతోపాటు వేంకటాచలనిలయం…, నీవల్లనే నిజమూర్తివి…, శ్రీనివాస తిరువేంగడముడయాల్, ఉడయుండునిల్లై లను ఆలపించారు. వీరికి మృదంగంపై శ్రీవేంకటేశ్వర సంగీత కళాశాల అధ్యాపకులు శంకర్, వాయులీనంపై శ్రీమతి పూర్ణవైద్యనాథన్ సహకరించారు. రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు మహబూబ్నగర్కు చెందిన శ్రీ గద్వాల్ చంద్రశేఖర్రావు బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa