ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో తీవ్రమైన ఇసుక కొరత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2019, 06:23 PM

ప్రభుత్వ నూతన ఇసుక విధానం, ఇసుక సరఫరాలో లోపాలు వెరసి, ఇసుక కొరత కారణంగా కూలీల ఉపాధికి గండి పడింది. లక్షలాది మంది భవన నిర్మాణ, అనుబంధ రంగాల కార్మికులు పస్తులతో అలమటిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేదంటూ పేద కూలీలు విలవిలలాడే పరిస్థితి ఏర్పడింది. నెలల తరబడి పనుల్లేక, కుటుంబాలను గడుపుకోలేని దయనీయ స్థితిలో ఉన్నామని కూలీలు వాపోతున్నారు. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కవ మంది ఆధారపడిన నిర్మాణ రంగం ఇప్పుడు ఇసుక కొరతతో విలవిల్లాడోతుంది. ఇసుక అందుబాటులో లేనందున రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణాలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో వందలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. ఒక్క భవన నిర్మాణ రంగంపైనే ఆధారపడి సెంట్రింగ్, ఇటుక వంటి అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి పొందుతారు.
పల్లెల్లో వ్యవసాయ పనులు లేకుంటే.. పట్టణాల్లోని భవన నిర్మాణ పనులకు వెళ్లేవారు. అయితే ప్రస్తుతం నిర్మాణ రంగంలోనూ పనిలేని పరిస్థితి నెలకొనడంతో నిరాశ చెందుతున్నారు. ఇసుక ప్రభావం ఒక్క భవన కూలీలకే కాకుండా... స్టీలు, సిమెంట్‌ ఇతర నిర్మాణ సామగ్రి విక్రయాలు భారీగా పడిపోయాయి. ఇక ఆన్లైన్ లో మాత్రమే ఇసుక కోసం అప్లై చేసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది.  కానీ, ఆన్లైన్ ఓపెన్ చేసి ఇసుక బుక్ చేసుకోవాలని చూస్తే నో స్టాక్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఇసుక విధానంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  ఇసుక కొరతను ప్రభుత్వం కావాలనే సృష్టిస్తోందని, సిమెంట్ కంపెనీలకు ఇసుకను కట్టబెడుతున్నారని, ఫలితంగా ఇసుక దోరకడంలేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.  


 


ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని చెప్తోంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇసుకను అందరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అంటోంది. వరదల కారణంగానే ఇసుక కొరత ఏర్పడుతోందని కొంత మంది వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3వ తేదీన విశాఖలో లాంగ్ మార్చ్ చేయబోతున్నారు. అయితే తాజాగా ఇసుక కొరత వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇన్ని జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఇసుక కొరతను నివారించేందుకు తగిన ప్రయత్నాలు చేయలేకపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa