ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా ఉండే స్పిన్నర్లు టీ20ల్లో కీలకపాత్ర పోషిస్తారు...

national |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 04:35 PM

టీ20 క్రికెట్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అభిప్రాయపడ్డాడు. రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చాహల్‌ (2/28), సుందర్‌ (1/25) కీలక పాత్ర పోషించారు. బంగ్లా ఓపెనర్లు 7 ఓవర్లకు 60 పరుగులు చేసి జట్టుని పటిష్టస్థితిలో నిలిపినప్పటికీ... ఆ తర్వాత భారత స్పిన్నర్లు చెలరేగడంతో వరుస విరామాల్లో బంగ్లాదేశ్ వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ అనంతరం వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ "టీ20 ఫార్మాట్‌లో స్పిన్నర్ల పాత్ర ఎంతో కీలకం. ఎందుకంటే వారు బంతిని వేగంగా మార్పులు చేస్తారు. కొన్నిసార్లు పిచ్‌లు నుంచి స్పిన్నర్లకు తక్కువ సహకారం ఉంటుంది" అని అన్నాడు. "ఏమి చేయాలో తెలుసుకోవడం, బ్యాట్స్ మెన్ ఏ వైపు బంతిని బాదుతాడో, ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలియడం ముఖ్యం. దీంతో పాటు విషయాలను సరళంగా ఉంచడం మరియు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు. కానీ, ఇది ఆటలో భాగంగానే జరుగుతుంది" అని వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. "నిజాయితీగా చెప్పాలంటే, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయగల మరియు ఆట యొక్క కోణాన్ని మార్చగల చాహల్‌ ఉండటం జట్టుకు అత్యంత ప్రయోజనకరం. అతను మిడిల్ ఓవర్లలో బౌలింగ్‌కు వస్తాడు. 2-3 వికెట్లు తీసుకొని ఆటను పూర్తిగా మార్చేస్తాడు. వేర్వేరు బ్యాట్స్‌మెన్‌ వేర్వేరు ప్రణాళికలతో అతడిని ఎదుర్కొంటారు. చాహల్‌ చాలా తెలివైనవాడు" అని సుందర్‌ చెప్పుకొచ్చాడు. "నిజం చెప్పాలంటే రాజ్‌కోట్ వికెట్ చాలా బాగుంది. బౌన్స్‌తో బంతి గమనం నిజంగా అద్భుతం. మేము గనుక తొలుత బ్యాటింగ్ చేసినట్లైతే 180 పరుగులు చేసేవాళ్లం. బంగ్లాదేశ్‌ను 153/6కు పరిమితం చేసేందుకు బౌలింగ్‌ విభాగం సమష్టిగా కష్టపడింది. మొదట్లో బంగ్లా ఆటగాళ్లు బాగా ఆడారు. బంతి బాగా బౌన్స్‌, పేస్‌ అవుతోంది" అని సుందర్ తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa