ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో భూప్రకంపనలు!

national |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2019, 07:35 PM

శుక్రవారం (డిసెంబర్ 20) సాయంత్రం 5.09 గంటల సమయంలో ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు ఐఎండీ (ఇండియన్ మెటీరియోలజికల్ డిపార్ట్‌మెంట్) తెలిపింది. ఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్‌ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప కేంద్రం అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌పై భూకంప ప్రభావం అధికంగా ఉన్నట్లు సమాచారం. ఈ దేశాల్లోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. హర్యానా, జమ్మూ కశ్మీర్‌, ఉత్తారఖండ్, చంఢీగడ్‌లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పలుచోట్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు కంపించాయి. ఇళ్లలోని వస్తువులు, ఫ్యాన్లు, షాండీలియర్లు ఊగుతున్న వీడియోలను కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, లాహోర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు సంభవించాయి. ఆయా ప్రాంతాలకు చెందిన నెటిజన్లు ట్విటర్‌లో పోస్టులు చేస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa