జాతీయ జనాభా జాబితా (ఎన్పిఆర్) తయారీకి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీని కోసం రూ.8,500 కోట్లు కేటాయించేందుకు అంగీకరించింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఎన్పిఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలో నివసిస్తున్నవారి జాబితాను తయారు చేయడమే ఎన్పిఆర్ ప్రధాన ఉద్దేశం. 2015లో ఇంటింటి సర్వే ద్వారా ఎన్పిఆర్ను రూపొందించారు. దీనిని డిజిటలైజేషన్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1. దేశంలోని సాధారణ నివాసులను జాతీయ జనాభా జాబితాలో చేర్చుతారు. దీనిని గ్రామ, ఉప పట్టణ, ఉప జిల్లా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయులలో తయారు చేస్తారు. పౌరసత్వ చట్టం 1955; పౌరసత్వ నిబంధనలు2003 ప్రకారం ఈ జాబితాను రూపొందిస్తారు. దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ దీనిలో నమోదు చేయించుకోవాలి. ఇది తప్పనిసరి.
2. సాధారణ నివాసి అంటే స్థానిక ప్రాంతంలో కనీసం 6 నెలల నుంచి నివసిస్తున్న వ్యక్తి. తదుపరి 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం నివసించాలనే ఉద్దేశంతో ఉన్నవారు అని అర్థం కూడా.
3. దేశంలో నివసించే ప్రతి ఒక్క సాధారణ నివాసి గుర్తింపు వివరాలను సమగ్రంగా రూపొందించడమే ఎన్పిఆర్ ఉద్దేశం.
4. ఈ సమాచారంలో జనాభాపరమైన, బయోమెట్రిక్ సంబంధిత వివరాలు ఉంటాయి. దేశంలో నివసిస్తున్నవారి ఆధార్, మొబైల్ నంబర్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వివరాలు, భారత దేశ పాస్పోర్ట్ నంబర్లు వంటివాటిని సేకరిస్తారు.
5. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ ఇష్టమైతేనే ఇవ్వవచ్చు. ఆధార్ ఇవ్వడమనేది తప్పనిసరి కాదు. పుట్టిన తేదీ, జన్మస్థలం, జాతీయత, వివాహం జరిగిందా? భార్య/భర్త పేరు, తల్లిదండ్రుల పేర్లు వంటి వివరాలను ప్రజలు నమోదు చేయించుకోవలసి ఉంటుంది.
6. ఎన్పిఆర్, ఎన్పిఆర్ నవీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అడ్డుచెప్పింది. అదే విధంగా కేరళ, రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్పీఆర్ ప్రక్రియకు సహకరించబోమని స్పష్టం చేశాయి.
7. ఎన్పిఆర్ పూర్తయి, అధికారిక ముద్రణ తర్వాత ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్సీ) రిజిస్టర్కు ఆధారంగా చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అసోంలో ఇటీవలే ఎన్ఆర్సిని అమలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ నిజమైన పౌరుల వివరాలను సేకరించే ఎన్పిఆర్ ప్రక్రియలో అసోంను మినహాయించారని చెప్పవచ్చు.
8. ఎన్పిఆర్ ద్వారా సేకరించిన సమాచారం ప్రజా బాహుళ్యంలో కనిపించదు. ప్రొటోకాల్ను అనుసరించి కొంతమంది ప్రత్యేక యూజర్లకు మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు ఎన్పిఆర్ డేటాను వినియోగించుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa